‘నోటా’పై హైకోర్టులో పిటిషన్‌

3 Oct, 2018 16:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌ హీరో ‘విజయ్‌ దేవరకొండ’ నటించిన ‘నోటా’ సినిమాకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిసిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా నోటా సినిమాను నిలిపివేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. కాగా నోటా అనే పదాన్ని సినిమా టైటిల్‌గా వాడటాన్ని తప్పుపడుతూ ఓయూ జేఏసీ నేత కైలాస్‌ నేత ఈ బుధవారం హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. నోటా అనే పదాన్ని వాడే ముందు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరని హైకోర్టుకు తెలిపారాయన.

తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున చిత్రాన్ని, ఎన్నికల సంఘం వీక్షించి అభ్యంతర సన్నివేశాలు ఉంటే తొలిగించిన తర్వాతే చిత్రం విడుదలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇది రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి ఓటర్లను ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని, ఎన్నికల సంఘం సినిమా చూసిన తర్వాతే విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ గురువారం పిటిషన్‌ విచారణకు రానుంది. 

మరిన్ని వార్తలు