నాన్నకు ప్రేమతో టీంకు నోటీసులు

14 Jan, 2016 18:42 IST|Sakshi
నాన్నకు ప్రేమతో టీంకు నోటీసులు

హైదరాబాద్: జూనియర్ ఎన్‌టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో చిత్ర బృందానికి రాష్ట్ర మైనారిటీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టర్లు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని కొందరు మైనారిటీ కమ్యూనిటీ వ్యక్తులు కమిషన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో దానిని పరిశీలించిన కమిషన్ నోటీసులు పంపించింది. చిత్ర నిర్మాతలకు, చిత్ర నటీనటులకు పంపించింది. అంతకుముందు ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు కమిషనర్లకు, సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారికి నోటీసులు పంపించింది. ఎందుకు మీపై ఈ ఫిర్యాదులకు సంబంధించి చర్యలు తీసుకోకూడదో వివరించాలని పేర్కొటూ ఈ నెల 18కి వాయిదా వేసింది.

అంతకుముందు కూడా జూనియర్ ఎన్‌టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా పోస్టర్ ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచురించారని మైనార్టీ యువజన సంఘాల నాయకులు వరంగల్ జిల్లా జనగామ కోర్టులో కొందరు ప్రైవేటు కేసు వేశారు. సినిమా దర్శకుడు సుకుమార్, నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్, హీరో జూనియర్ ఎన్‌టీఆర్, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్, ఆటోగ్రఫీ విజయ్ చక్రవర్తిపై మైనార్టీ యువజన సంఘాల నాయకులు ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై చిత్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ క్షమాపణలు కూడా చెప్పారు.