పనామా పేపర్లలో మరో బాలీవుడ్ నటుడు

4 May, 2016 11:41 IST|Sakshi
పనామా పేపర్లలో మరో బాలీవుడ్ నటుడు

ముంబయి: ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన మోసాక్ ఫోనెస్కాకు చెందిన పనామా పేపర్స్  తాజాగా మరో బాలీవుడ్ నటుడి వ్యవహారం బయటపెట్టాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ బ్రిటన్‌లోని వర్జిన్ ఐలాండ్ కు చెందిన మేరిలిబోన్ ఎంటర్ టైన్మెంట్ అనే సంస్థలో దాదాపు వెయ్యి షేర్లు కొనుగోలు చేశారని పనామా బయటపెట్టింది.

అజయ్ తన కంపెనీ నిసా యుగ్ ఎంటర్ టైన్ మెంట్ పేరిట ఈ షేర్లు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ కంపెనీలో ఆయన భార్య కాజల్ కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ కంపెనీకి అజయ్ 2013లో డైరెక్టర్ గా ఉండి.. 2014లో రాజీనామా చేశారు. పనామా బయటపెట్టిన వివరాలపై ఆయన స్పందిస్తూ..  తాను ఆర్బీఐ మార్గదర్శకాలు పాటించే విదేశాల్లోని ఆ కంపెనీలో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టానని చెప్పారు. చట్ట ప్రకారం చేయాల్సిన ట్యాక్స్ రిటర్న్స్ కూడా చేశామని, వాటి వివరాలు తన కుటుంబం ఇప్పటికే తెలియజేసిందని అన్నారు.