మీలో ఎవరు కోటీశ్వరుడు.. బై మహేష్ బాబు!!

5 Sep, 2014 09:07 IST|Sakshi
మీలో ఎవరు కోటీశ్వరుడు.. బై మహేష్ బాబు!!

'మీలోఎవరు కోటీశ్వరుడు'... తెలుగు టెలివిజన్ పరిశ్రమలోనే అత్యంత ప్రేక్షకాదరణ సాధించిన షో. మొదటి విడతలో ఏ ఒక్కరినీ కోటీశ్వరులను మాత్రం చేయలేకపోయిన ఈ షోను నాగార్జునకు బదులు మహేష్ బాబు నిర్వహిస్తే ఎలా ఉంటుంది? అవును.. ఇది ఇప్పటకే జరిగింది కూడా. అయితే ఇది నిజంగా మాత్రం కాదండోయ్.. ఆగడు సినిమాలోనట. వేడి వేడి తాజా కబుర్లన్నింటినీ తన సినిమా చూసే ప్రేక్షకులు సరదాగా నవ్వుకోడానికి అద్భుతంగా పండించే అలవాటున్న దర్శకుడు శ్రీను వైట్ల ఆగడు చిత్రంలో ఈ ప్రయోగం చేశాడని సమాచారం. ఇంతకుముందు దూకుడులో కూడా ఇలాంటి ప్రయోగాలే చేసి సక్సెస్ అయ్యాడు.

నాగార్జునకు బదులు మహేష్ బాబు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' లాంటి షో నిర్వహిస్తాడని, అది కూడా ఏదో సరదా సన్నివేశంలా కాకుండా.. సినిమాకు చాలా ఉపయోగపడే అత్యంత కీలక సన్నివేశంలోనని సినిమా వర్గలు చెబుతున్నాయి. 'దూకుడు' సినిమాలో నాగార్జున నిర్వహించే రియాల్టీ షో కోసం పెన్ను కెమెరాను చూస్తూ బ్రహ్మానందం చెప్పే డైలాగును ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇక 'ఆగడు'లో ఈ కోటీశ్వరుడు షో ఇంకెంత సందడి చేస్తుందోనని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అది తెలియాలంటే మాత్రం మరొక్క 15 రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే, ఆగడు చిత్రం సెప్టెంబర్ 19వ తేదీన విడుదల అవుతుందని స్వయంగా మహేష్ బాబే ఆ చిత్ర ఆడియో రిలీజ్ సందర్భంగా వేదికపై ప్రకటించారు.