మీరు లేని లోటు తీరనిది: జూనియర్‌ ఎన్టీఆర్‌

28 May, 2020 10:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు శ్రద్దాంజలి ఘటించారు.  కరోనా పరిస్థితుల నేపథ్యంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు నేడు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్‌ జయంతి పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పించారు. మెగాస్టార్‌ చిరంజీవి స్వర్గీయ ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.  

‘తెలుగు జాతి  పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం.. తెలుగు నేల  గుండెల్లో  ఎన్నటికీ  చెదరని జ్ఞాపకం.. నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం.. వారితో కలిసి నటించడం నా అదృష్టం.. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..’ అంటూ ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఆనాటి ఫోటోను కూడా ట్విటర్‌లో షేర్‌ చేశారు. 1981లో చిరంజీవి, ఎన్టీఆర్‌లు కలిసి ‘తిరుగులేని మనిషి’ అనే చిత్రంలో నటించిన విషయం తెలసిందే.  (ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద బాలకృష్ణ నివాళి)

‘మీరు లేని లోటు తీరనిది’ అని పేర్కొంటూ ‘మీ పాదం మోపక తెలుగ ధరిత్రి చిన్నబోతోంది.. మీ రూపు కానుక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా సదా మీ ప్రేమకు బానిసను’ అంటూ యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. వీరితో పాటు నందమూరి కళ్యాణ్‌రామ్‌, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, తదితర టాలీవుడ్‌ ప్రముఖులు ట్విటర్‌ వేదికగా ఎన్టీఆర్‌ ఘన నివాళులర్పించారు. (అక్కడకు వెళ్లకూడదని నిర్ణయం..)

మరిన్ని వార్తలు