షూటింగ్ మొదలవ్వకుండానే పోటీకి రెడీ

9 Feb, 2016 10:34 IST|Sakshi
షూటింగ్ మొదలవ్వకుండానే పోటీకి రెడీ

టాలీవుడ్ స్టార్స్ కూడా బాలీవుడ్ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. గతంలో సినిమా రెడీ అయ్యాక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకునే టాలీవుడ్ దర్శక నిర్మాతలు, ఇప్పుడు రూట్ మార్చారు. సినిమా మొదలు కాకముందే రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకొని అందుకు తగ్గట్టుగా షూటింగ్ను ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ జనరేషన్ యంగ్ హీరోలు ఇలా పక్కా ప్లానింగ్తో తమ సినిమాలను తెరమీదకు తీసుకువస్తున్నారు.

అయితే ఇంత ముందుగా ప్లాన్ చేసుకున్నా పోటీ మాత్రం తప్పటం లేదు. ఇంకా తమ నెక్ట్స్ సినిమాల షూటింగ్ కూడా మొదలు పెట్టని ఎన్టీఆర్, రామ్ చరణ్లు బిగ్ ఫైట్కు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతాగ్యారేజ్ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. అదే సమయంలో రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనీఒరువన్ను తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఇప్పటి వరకు ఈ రెండు సినిమాల షూటింగ్ మొదలు కాకపోయినా రిలీజ్ డేట్స్ మాత్రం ఫిక్స్ చేసేశారు.

ఈ రెండు సినిమాలను ఆగస్టు 12న రిలీజ్ చేయడానికి రెండు చిత్రయూనిట్లు ప్లాన్ చేసుకుంటున్నాయి. అయితే ఇంత ముందుగా ప్లాన్ చేసుకొని కూడా ఒకే రోజు పోటీ పడటం ఎందుకన్న వాదన బలంగా వినిపిస్తోంది. సంక్రాంతి సినిమాల విషయంలో కూడా ఒకేసారి నాలుగు సినిమాలు రిలీజ్ కావటంతో కలెక్షన్ల విషయంలో అన్ని సినిమాలు కాస్త వెనకబడ్డాయి. మరి అనుకున్నట్టుగా చెర్రీ, తారక్లు బరిలో దిగుతారా..? లేక ఎవరో ఒకరు వెనక్కు తగ్గుతారా..? చూడాలి.