జోరు మీదున్న ఎన్టీఆర్!

30 Oct, 2013 00:20 IST|Sakshi
‘అమ్మ తోడు అడ్డంగా నరుకుతా’... అంటూ ‘ఆది’లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇప్పుడిప్పుడే విన్నట్టుగా ఉంది. కానీ, కాలం వేగంగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా విడుదలై పదేళ్లకు పైనే అయ్యింది. అప్పట్లో ఎన్టీఆర్, బెల్లంకొండ సురేష్ కాంబినేషన్‌లో ఇదో సంచలనాత్మక చిత్రం. పదేళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. ఎన్టీఆర్, విలన్ బృందం పాల్గొనగా ఓ ఫైట్‌ను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
 
  కాగా, ఈ చిత్రం ప్రారంభదశ నుంచీ ‘రభస’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారనే వార్త వచ్చింది. ఆ టైటిల్‌ని ఖరారు చేయలేదని చిత్రబృందం చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ‘జోరు’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ‘రభస’ కన్నా ‘జోరు’ బాగుందని ఎన్టీఆర్ కూడా భావిస్తున్నారట. టైటిల్ సంగతి ఎలా ఉన్నా... ప్రస్తుతం చిత్రీకరిస్తున్న ఫైట్‌లో మాత్రం ఎన్టీఆర్ జోరుగా, హుషారుగా పాల్గొంటున్నారట. ఈ చిత్రంలో సమంత, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు.
>