ఎన్టీఆర్, రణబీర్లకు కాగ్ నోటీసులు..!

5 Aug, 2017 11:50 IST|Sakshi
ఎన్టీఆర్, రణబీర్లకు కాగ్ నోటీసులు..!

సినిమా పారితోషకానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్, రణబీర్ కపూర్ లు పొందిన పన్ను మినహాయింపుపై నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కు ఇచ్చిన పన్ను మినహాయింపును కాగ్ తప్పు పట్టగా.. ఈ వ్యవహారంలో ఈ హీరోకి నోటీసులు జారీ చేస్తున్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించిన పారితోషకం వ్యవహారంలో ఎన్టీఆర్ అనుచిత రీతిలో పన్ను మినహాయింపు పొందినట్టుగా తెలుస్తోంది.

ఆ సినిమాకు గానూ ఎన్టీఆర్ 7.33 కోట్ల రూపాయల పారితోషకాన్ని తీసుకున్నాడట. లెక్క ప్రకారం అందులో కోటీ పది లక్షల రూపాయల పన్ను కట్టాల్సి ఉండగా, ఎక్స్‌పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద తారక్ పన్ను మినహాయింపును పొందినట్టుగా తెలుస్తోంది. సినిమాలో ఎక్కువగా భాగం లండన్ లో షూట్ చేయటంతో సేవలు ఎగుమతి చేస్తున్నామన్న కారణం చూపి 1.10 కోట్ల ట్యాక్స్ మినహాయింపు పొందారు.

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా ఆయే దిల్ హై ముష్కిల్ సినిమా విషయంలో ఈ తరహా మినహాయింపు పొందటంతో అతనికి కూడా నోటీసులు అందాయి. వీరికి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన విషయంలో కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని కాగ్ భావించింది. దీంతో ఇద్దరు నటులకు షోకాజ్ కం డిమాండ్ నోటీసులు ఇవ్వటంతో పాటు అలాంటి అవకతవకలు ఇంకా ఉన్నాయా పరిశీలించమని సంబంధిత అధికారులను కోరింది.