'ఒక్కడు మిగిలాడు' మూవీ రివ్యూ

10 Nov, 2017 12:36 IST|Sakshi

టైటిల్ : ఒక్కడు మిగిలాడు
జానర్ : ఎమోషనల్‌ డ్రామా
తారాగణం : మంచు మనోజ్‌, అనీషా ఆంబ్రోస​, అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి, మిలింద్‌గునాజీ, పోసాని కృష్ణమురళీ
సంగీతం : శివ ఆర్‌ నందిగాం
దర్శకత్వం : అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి
నిర్మాత : ఎస్‌ఎన్‌ రెడ్డి

నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్‌ హీరోగా ఓ భారీ హిట్‌ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. కమర్షియల్‌ ఫార్ములా సినిమాల కన్నా ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు ఎక్కువగా ఇంట్రస్ట్‌ చూపించే మనోజ్‌, మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీలంక శరణార్థుల నేపథ్యంలో తెరకెక్కిన ఒక్కడు మిగిలాడు సినిమాలో రెండు విభిన్న పాత్రలో నటించిన మనోజ్‌ ఆకట్టుకున్నాడా..? నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో కమర్షియల్‌ సక్సెస్‌ సాదించాడా..?

కథ :
తన ప్రమోషన్‌ కోసం ఓ కాలేజ్‌ ప్రొఫెసర్‌ తన స్టూడెంట్స్‌ అయిన ముగ్గురమ్మాయిలను మోసం చేసి ఓ మినిస్టర్‌ (మిలింద్‌ గునాజీ) కొడుకుల దగ్గరకు పంపిస్తాడు. విషయం తెలుసుకున్న అమ్మాయిలు వాళ్లనుంచి తప్పించుకునేందుకు మరో దారిలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారు. బయటి ప్రపంచానికి అసలు విషయం తెలియకుండా వాళ్ల వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరిస్తారు. నిజం తెలుసుకున్న విద్యార్థి నాయకుడు సూర్య(మంచు మనోజ్‌)  విద్యార్థి ఉద్యమానికి పిలుపునిస్తాడు. కానీ మినిస్టర్‌ తన బలాన్ని ఉపయోగించి ఉద్యమాన్ని అనచివేసి సూర్యని అరెస్ట్‌ చేయిస్తాడు. కేసు కూడా  నమోదు చేయకుండా చిత్ర హింసలు పెట్టి ఎన్‌కౌంటర్‌ చేయాలని ప్లాన్‌ చేస్తారు. (సాక్షి రివ్యూస్‌) వారి కుట్రల నుంచి సూర్య ఎలా తప్పించుకున్నాడు..? సూర్యకు శ్రీలంక శరణార్థలు కోసం పోరాడిన విప్లవనాయకుడు పీటర్‌ (మంచు మనోజ్‌)కు సంబంధం ఏంటి..? ఈ పోరాటంలో చివరకు సూర్య గెలిచాడా..లేదా..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
ఇప్పటికే నటుడిగా ప్రూవ్‌ చేసుకున్న మంచు మనోజ్‌ ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. విద్యార్థి నాయకుడిగా మనోజ్‌ నటన చాలా సహజంగా అనిపించింది. ఎక్కువగా అల్లరి క్యారెక్టర్‌ లు మాత్రమే చేసిన మనోజ్‌ ఈ సినిమాతో బరువైన ఎమోషన్లు కూడా పండించగలడని ప్రూవ్‌ చేసుకున్నాడు. సూర్య పాత్రలో నేచురల్‌ గా కనిపించిన మనోజ్‌, పీటర్‌ పాత్రలో కాస్త డ్రమెటిక్‌గా కనిపించాడు. మరో కీలక పాత్రలో నటించిన దర్శకుడు అజయ్‌ ఆండ్రోస్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సముద్రం మీద తెరకెక్కిన సన్నివేశాల‍్లో అజయ్‌ నటన సినిమాకు ప్లస్‌ అయ్యింది. (సాక్షి రివ్యూస్‌)బోట్‌ ప్రయాణంలో కనిపించిన వారంతా నేచురల్‌ గా నటించి మెప్పించారు. సిన్సియర్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ పాత్రలో పోసాని కృష్ణమురళీ మరోసారి తన  మార్క్‌ చూపించాడు. జర్నలిస్ట్‌ పాత్రలో అనీష ఆంబ్రోస్‌ పరవాలేదనిపించింది. ఇతర పాత్రల్లో సుహాసిని, మిలింద్‌ గునాజీ, బెనర్జీ తమ​ పాత్రలకు న్యాయం చేశారు.

విశ్లేషణ :
శ్రీలంకలో శరణార్థుల సమస్యల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు అజయ్‌, సినిమాను రియలిస్టిక్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అక్కడి ప్రజల సమస్యలను వాళ్లు పడుతున్న ఇబ్బందులను, అక్కడి నుంచి శరణార్థులగా తప్పించుకొని వస్తున్న వారు ఆ ప్రయత్నంలో ఎలా ప్రాణాలు కోల్పోతున్నారో కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. సినిమాను రియలిస్టిక్‌ గా తెరకెక్కించటంతో కమర్షియల్‌ సినిమాగా కన్నా ఓ డాక్యుమెంటరీ సినిమాలా అనిపించింది. ఇక శ్రీలంక పోరాటం నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాల్లో పాత్రల నటన చాలా డ్రమెటిక్‌ గా అనిపిస్తుంది. బోట్‌ ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కిన సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కినా.. నిడివి కాస్త తగ్గించి ఉంటే బాగుండేది. ఎమోషనల్‌ డ్రాగా తెరకెక్కిన సినిమాలో కథను పక్కదారి పట్టించే పాటలు లేకపోవటంతో సినిమా అంతా ఒకే మూడ్‌లో సాగుతుంది.(సాక్షి రివ్యూస్‌) అక్కడక్కడ వినిపించిన బిట్‌ సాంగ్స్‌ సన్నివేశాలు మరింత ఎలివేట్‌ అయ్యేందుకు హెల్ప్‌ అయ్యాయి. నేపథ్యం సంగీతం కూడా సినిమా మూడ్‌ ను క్యారీ చేసింది. సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ సినిమాటోగ్రఫి, శ్రీలంకలోని పోరాట సన్నివేశాలతో పాటు బోటు ప్రయాణం సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.


ప్లస్ పాయింట్స్ :
మంచు మనోజ్‌ నటన
కథ
నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :
మితిమీరిన డ్రామా
సినిమా నిడివి

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Poll
Loading...
మరిన్ని వార్తలు