పాత కాంబినేషన్... కొత్త సినిమా...

19 Jan, 2016 00:14 IST|Sakshi
పాత కాంబినేషన్... కొత్త సినిమా...

 హీరో కమలహాసన్ ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్నారు. ఒక సినిమా సెట్స్‌లో ఉండగానే, తరువాతి సినిమాకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే ‘చీకటి రాజ్యం’ (తమిళంలో ‘తూంగా వనమ్’)తో ప్రేక్షకులను పలకరించిన ఆయన టి.కె. రాజీవ్ కుమార్ దర్శకత్వంలో తెలుగు, తమిళాల్లో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. జరీనా వహాబ్, అక్కినేని అమల నటిస్తున్న ఆ చిత్రం తాలూకు ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ‘అమ్మానాన్న ఆట’ అని పేరు పెట్టిన ఆ సినిమాలో కమల్‌తో కలసి ఆయన కుమార్తె శ్రుతీహాసన్ కూడా నటించనున్నారు. తండ్రీ కూతుళ్ళిద్దరూ కలసి నటిస్తున్న తొలి సినిమా అదే. ఇన్ని విశేషాలున్న కొత్త సినిమా పని హడావిడిలో ఉండగానే, కమల్ ఆ తరువాతి సినిమాకు కూడా ప్లాన్ సిద్ధం చేసినట్లు భోగట్టా. తెలుగు, తమిళాల్లో వాణిజ్యపరంగా సక్సెస్ అనిపించుకున్న ‘చీకటి రాజ్యం’ దర్శకుడు రాజేశ్ ఎం. సెల్వా దానికి దర్శకుడట!

గతంలో దాదాపు ఏడేళ్ళ పాటు తన దగ్గర సహాయకుడిగా పనిచేసిన రాజేశ్‌తో ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ కొత్త సినిమాకు కమల్ శ్రీకారం చుడతారట! ‘‘ఇది పూర్తిస్థాయి యాక్షన్ సినిమా. మారిషస్‌లో చిత్రీకరించాలని భావిస్తున్నారు. నిజానికి, ‘చీకటి రాజ్యం’ కన్నా ముందే ఈ కథను తెరకెక్కించాలని భావించారు. కానీ, అప్పట్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్క లేదు. మళ్ళీ ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో ఆ ప్రాజెక్ట్‌లో కదలిక వచ్చింది’’ అని కోడంబాకమ్ వర్గాల కథనం. అంటే, మొత్తానికి కమలహాసన్ ఈ ఏడాది చకచకా రెండు సినిమాలు చేయనున్నారన్న మాట! మన అగ్ర హీరోలందరూ నిదానంగా అడుగులు వేస్తుంటే, వయసు, అనుభవం పెరిగిపోతున్నకొద్దీ కమల్‌లో జోరు పెరిగిపోతుండడం విశేషమే!!