ఓంకార్ 'రాజుగారి గది-2'

25 Aug, 2016 19:04 IST|Sakshi
ఓంకార్ 'రాజుగారి గది-2'

దర్శకుడిగా మారిన పాపులర్ టీవీ యాంకర్ ఓంకార్ మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు. తన తమ్ముడు అశ్విన్ను హీరోగా పెట్టి 'రాజుగారి గది' అనే హారర్ కామెడీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. సినిమా అనుకున్నదాని కంటే హిట్ అవ్వడంతో మళ్లీ అదే జానర్లో 'రాజుగారి గది-2' ను తీసేందుకు సిద్ధమవుతున్నాడు.  మరింత భయంతో కూడిన వినోదాన్ని ప్రేక్షకులకు అందించే పనిలో పడ్డాడు.

ఓంకార్ 'రాజుగారి గది' చిత్రాన్ని వారాహి చలన చిత్ర బ్యానర్ సహకారంతో నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు 'రాజుగారి గది-2'  చిత్రానికి పి.వి.పి సినిమా బ్యానర్ తోడయ్యింది. పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్ , ఓక్ ఎంటర్టెయిన్మెంట్ ప్రై.లి. బ్యానర్స్ సంయుక్తంగా 'రాజుగారి గది-2' నిర్మించేందుకు ముందుకొచ్చాయి. నటీనటులు, ఇతర టెక్నీషియన్ల ఎంపిక జరగాల్సి ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని పివిపి సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.