సినీ నిర్మాత నట్టి కుమార్‌కు ఏడాది జైలుశిక్ష

7 Mar, 2020 10:25 IST|Sakshi

విజయనగరం లీగల్‌: చెక్‌ బౌన్స్‌ కేసులో సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ నట్టి కుమార్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6 లక్షల జరిమానా విధిస్తూ స్థానిక మొబైల్‌ మెజిస్ట్రేట్‌ కె.దీపదివ్యకృప శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుని న్యాయవాది ఇనుగంటి రమేష్‌ తెలిపిన వివరాలు.. నట్టి కుమార్‌ కరుణాలయ ఫిల్మ్స్‌ పేరుతో విశాఖలో సినీ డిస్ట్రిబ్యూషన్‌ చేసేవారు. 2009 సెప్టెంబర్‌లో విజయనగరంలోని రాజ్యలక్ష్మీ థియేటర్‌లో ‘శంఖం’ సినిమా రెండు వారాల పాటు ప్రదర్శించేందుకు థియేటర్‌ యాజమాన్యంతో రూ.6.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

అయితే, వారం రోజుల తరువాత సినిమా ప్రదర్శన నిలిపేశారు. దీంతో యాజమాన్యానికి, నిర్మాతకు మధ్య వివాదం తలెత్తింది. పెద్దల జోక్యంతో నిర్మాత రూ.5.5 లక్షలు థియేటర్‌ యాజమాన్యానికి ఇవ్వడానికి అంగీకరించి చెక్‌ను థియేటర్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ ఎ.రవికుమార్‌కు ఇచ్చారు. అయితే, నట్టి కుమార్‌ ఇచ్చిన చెక్‌ బౌన్స్‌ అయ్యింది. దీనిపై రవికుమార్‌ కోర్టును ఆశ్రయించగా, నట్టికుమార్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6 లక్షల జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్‌ తీర్పు చెప్పారు. (విలాసవంతమైన బంగ్లా కొన్న ప్రముఖ సింగర్‌)

మరిన్ని వార్తలు