‘సాహో’పై పోలీసులకు ఫిర్యాదు

18 Oct, 2019 09:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడిన ‘సాహో’కు కష్టాలు కొనసాగుతున్నాయి. తమను మోసం చేశారంటూ సాహో చిత్ర నిర్మాతలపై అవుట్‌ షైనీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ పోలీసులను ఆశ్రయించింది.
ఒప్పందం ప్రకారం సాహో సినిమాలో హీరో ప్రభాస్, హీరోయిన్‌ శ్రద్ధ కపూర్‌ తమ కంపెనీకి చెందిన బ్యాగ్‌ వాడలేదని కంపెనీ మార్కెటింగ్‌ హెడ్‌ బి.విజయరావు గురువారం మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకట్‌ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

సినీ నిర్మాతలు వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి, హిమాక్‌ దువ్వూరు తమ కంపెనీకి చెందిన అర్కిటిక్‌ ఫాక్స్‌ లగేజ్‌ బ్యాగ్‌ను సాహో సినిమాలో హీరో ప్రభాస్, హీరోయిన్‌ శ్రద్ధ కపూర్‌ వాడేలా ఒప్పందం చేసుకున్నారన్నారు. ఇందుకు గాను రూ.37లక్షలు చెల్లించామని, మరో కోటి రూపాయలు ఖర్చు అయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఒప్పందం ప్రకారం బ్యాగ్‌ను వాడకుండా మోసం చేశారని ఫిర్యాదు పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారుల సలహా తీసుకుని కేసు నమోదు చేస్తామని సీఐ పేర్కొన్నారు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో’ సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది. సినిమా ప్లాప్‌ కావడంతో అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ఆగస్టు 30న విడుదలైన ఈ సినిమా అక్టోబర్‌ 19 నుంచి తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాషల్లో సాహో సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. (చదవండి: అలా చేస్తే సినిమా బాగాలేదని ఒప్పుకున్నట్లే!)

మరిన్ని వార్తలు