త్వరలో తెరపైకి ఓవియ విట్టా యారు

25 Aug, 2017 01:43 IST|Sakshi
త్వరలో తెరపైకి ఓవియ విట్టా యారు

తమిళసినిమా: ఓవియ విట్టా యారు చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. విశేషం ఏమిటంటే నటి ఓవియతో పాటు బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొన్న పలువురు ఈ చిత్రంలో నటించారు. బిగ్‌బాస్‌ గేమ్‌ షోలో తన సహజ సిద్ధమైన నటనతో విశేష ప్రాచుర్యాన్ని పొందిన నటి ఓవియ కథానాయకిగా నటించిన ఇందులో నూతన నటుడు సంజీవి కథానాయకుడిగా నటించారు. బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న నటుడు గంజాకరుప్పు, వైయాపురి ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు రాధారవి, సెంథిల్, శరవణన్, మనోజ్‌కుమార్‌ నటించారు. ఇందులో ఒక ఏనుగు ప్రధాన పాత్రగా ఉంటుందని దర్శకుడు రాజ్‌దురై తెలిపారు.

సినీ పీఆర్‌ఓ మదురై ఆర్‌.సెల్వన్‌ నిర్మాతగా మారి వేలమ్మాళ్‌ సినీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మించిన చిత్రం ఓవియ విట్టా యారు. శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మదురై ఆర్‌.సెల్వన్‌ మాట్లాడుతూ ఒక యువకుడు శ్రమను కాకుండా అదృష్టాన్ని నమ్ముకోవడంతో జరిగే పరిణామాలే చిత్ర ప్రధానాంశం అని తెలిపారు. ఇందులో ఓవియకు సాయం చేసే పాత్రలో ఏనుగు నటించిందని తెలిపారు. చిత్రంలో ఏనుగు పేరు సీనీ అని చెప్పారు. మొదట ఈ పేరునే చిత్రానికి అనుకున్నామని, ఆ తరువాత ఓవియ విట్టా యారు అని మార్చామని చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.