ఇక...‘స్వర సామ్రాజ్ఞి’

10 May, 2016 22:53 IST|Sakshi
ఇక...‘స్వర సామ్రాజ్ఞి’

సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయని ‘పద్మభూషణ్’ పి. సుశీల విమల గాంధర్వ గాత్రానికి కోట్ల సంఖ్యలో అభిమాను లున్నారు. ఆ గాత్ర మాధుర్యానికి పరవశించి, దేశ విదేశాల్లో ఇప్పటి దాకా ఎన్నో సత్కారాలు, మరెన్నో బిరుదాలు దక్కాయి. వేల సంఖ్య లో పాటలు పాడిన ఈ గాయనీమణి పేరు ఇటీవలే ‘గిన్నిస్ బుక్’ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకీ ఎక్కింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఆమెకు ఘన సత్కారం జరగనుంది.

ఈ గానకోకిల కీర్తికిరీటంలో ‘స్వర సామ్రాజ్ఞి’ అనే మరో కొత్త బిరుదు వచ్చి చేరనుంది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగే భారీ వేడుకలో ఈ బిరుదు ప్రదానం జరగనుంది. ‘‘సుశీలగారి ముందు, తరువాతి తరాల గాయనీ గాయకుల మొదలు సినీ, రాజకీయ, సాంస్కృతిక, కళా రంగాల ప్రముఖులెంతో మంది ఈ సన్మానంలో పాలుపంచుకొంటారు’’ అని ఈ సత్కార నిర్వాహకులు, ‘సంగమం’ వ్యవస్థాపకులు సంజయ్ కిశోర్ తెలిపారు.