ఎంతో కష్టపడి తీశాను.. ఆ రూమర్స్‌ నమ్మకండి!

9 Nov, 2017 09:32 IST|Sakshi

తన తాజా సినిమా ’పద్మావతి’పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించలేదని, ఈ సినిమాతో రాజ్‌పుత్‌ల పట్ల గౌరవం పెంపొందుతుందే కానీ, భంగం వాటిల్లబోదని ఆయన భరోసా ఇచ్చారు.

’ ఎంతో నిజాయితీతో, బాధ్యతతో, అకుంఠిత దీక్షతో ఈ సినిమాను తెరకెక్కించాను. రాణి పద్మావతి కథ నాలో ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతూ ఉంటుంది. ఆమె వీరోచిత పోరాటం, త్యాగానికి ఘననివాళిగా ఈ చిత్రాన్ని రూపొందించాను. కొన్ని వందతుల వల్ల ఈ సినిమాపై వివాదం తలెత్తింది’ అని భన్సాలీ పేర్కొన్నారు.


’రాణి పద్మావతి, అల్లావుద్దీన్‌ ఖిల్జీ మధ్య డ్రీమ్‌సీక్వెన్స్‌ సినిమాలో ఉన్నట్టు వచ్చిన వదంతులను నేను ఇప్పటికే ఖండించాను. వారిద్దరి మధ్య అలాంటి సన్నివేశాలు ఉండవని రాతపూర్వకంగా హామీ ఇచ్చాను. ఈ వీడియో ద్వారా నేను మరోసారి స్పష్టం చేస్తున్నా..  ఎవరి మనోభావాలు దెబ్బతీసేవిధంగా రాణి పద్మావతి, ఖిల్జీ మధ్య సన్నివేశాలు ఉండబోవు’ అని భన్సాలీ తెలిపారు. ఈ మేరకు పద్మావతి సినిమా అధికారిక ట్విట్టర్‌ పేజీలో ఆయన ఒక వీడియోను పోస్టు చేశారు.

రాణి పద్మావతి చరిత్రను వక్రీకరించేలా భన్సాలీ ఈ సినిమా తీశారంటూ రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌, గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సైతం ఈ సినిమాకు వ్యతిరేకంగా గొంతెత్తుతోంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర సెన్సార్‌ బోర్డు (సీబీఎఫ్‌సీ)కి లేఖ రాయాలని బీజేపీ భావిస్తున్న సంగతి తెలిసిందే. క్షత్రియ సామాజికవర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఈ సినిమా ఉందని ఆరోపణలు వస్తున్నాయని, రాణి పద్మావతికి, దురాక్రమణకు దిగిన సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీకి మధ్య లింక్స్‌ ఉన్నట్టు ఈ సినిమాలో చరిత్ర వక్రీకరించారని ఆరోపణలు వినిపిస్తుండటంతో వివాదం ముదురుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలతోపాటు రాజ్‌పుత్‌ వర్గంవారు ఈ సినిమాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు