ఆ నటిని ఓల్డ్ ఏజ్ హోమ్ కు తరలించారు

1 Jun, 2017 17:28 IST|Sakshi
ఆ నటిని ఓల్డ్ ఏజ్ హోమ్ కు తరలించారు
'పాకీజా' చిత్రంలో తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించిన అలనాటి నటి గీతా కపూర్‌ ను ఇటు కొడుకు.. అటు కూతురు ఇద్దరూ అనాథగా వదిలేశారు. వృద్ధాప్యంలో ఉన్న ఆమెను తన కొడుకు ఆసుపత్రిలో నిస్సహాయస్థితిలో వదిలేసి వెళ్లడంతో ప్రస్తుతం గీతా కపూర్ ను వృద్ధశ్రమానికి తరలించారు.గీతాజీని చాలా గౌరవప్రదమైన ఓల్డ్ ఏజ్ హోమ్ కు తరలించామని, తల్లిని కొడుకు వదిలిపెట్టడం అతిపెద్ద నేరమని ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ అన్నారు. గత నెల ముంబైలోని గోరేగావ్‌లోని ఎస్‌వీఆర్‌ ఆస్పత్రిలో ఆమెను తన కుమారుడు చేర్పించాడు. ఆ తరువాత బిల్లు కట్టేందుకు ఏటీఎం నుంచి డబ్బు తీసుకొస్తానంటూ చెప్పి వెళ్లిపోయిన అతడు ఇంతవరకు తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఆమె ఆసుపత్రిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపింది. కుమార్తెకు ఫోన్‌ చేసినా రాంగ్‌ నంబర్‌ అంటూ పెట్టేసింది. దీంతో అనాథగా ఆసుపత్రిలో ఏడుస్తూ ఉండిపోయింది. 
 
తనను వదిలించుకోవాలని తన కొడుకు చూసేవాడని, అందుకే తనను ఆస్పత్రిలో వదిలేసి పోయాడని ఆమె మీడియాకు తెలిపింది. 'అతని చర్యలను తప్పుబట్టడంతో నన్ను కొట్టేవాడు. నాలుగు రోజులకు ఒకసారే అన్నం పెట్టేవాడు. కొన్నిసార్లు నన్ను గదిలో పెట్టి బంధించాడు. నేను వృద్ధాశ్రమానికి వెళ్లేందుకు నిరాకరించడంతోనే ఇలా చేశాడు. అతడు ఉద్దేశపూర్వకంగా ఆకలితో మాడ్చి.. నేను అనారోగ్యానికి గురయ్యేలా చేశాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్చి పరారయ్యాడు' అని ఆమె తెలిపింది. ఇక గీతాకపూర్‌ కూతురు పూజ కూడా ఈ విషయంలో పట్టనట్టు దూరంగా ఉండటంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆమెను వృద్ధశ్రమానికి తరలించారు.