27న తెరపైకి ‘పక్కా’

22 Apr, 2018 08:29 IST|Sakshi

తమిళసినిమా: ఈ నెల 27న తెరపైకి రావడానికి ‘పక్కా’చిత్రం రెడీ అవుతోంది. నటుడు విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటించిన చిత్రం పక్కా. ఆయనతో నటి నిక్కీగల్రాణి, బిందుమాధవి నాయికలుగా నటించారు. చిత్రంలో సూరి, సతీష్, ఆనంద్‌రాజ్, నిళల్‌గళ్‌రవి, సింగముత్తు, సింగంపులి, రవిమరియ, వైయాపురి, ఇమాన్‌అన్నాచ్చి, జయమణి, కృష్ణమూర్తి, ముత్తుకాళై, సిజర్‌మనోహర్, సుజాత, నాట్టామైరాణి, సాయిదీనా ముఖ్య పాత్రలను పోషించారు. పెణ్‌ కన్‌స్టోరిటియం పతాకంపై టి.శివకుమార్‌ ముఖ్య పాత్రలో నటించి, నిర్మించిన ఈ చిత్రానికి బి.శరవణన్‌ సహనిర్మాతగా వ్యవహరించారు.

ఎస్‌ఎస్‌.సూర్య కథ, కథనం, మాటలు, దర్శకత్వం వహించారు. ఎస్‌.శరవణన్‌ ఛాయాగ్రహణం, సి.సత్య సంగీతం అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పూర్తిగా వినోద ప్రధానంగా తెరకెక్కించిన చిత్రమన్నారు. నటుడు విక్రమ్‌ప్రభును కొత్తగా చూపించే ప్రయత్నం చేశామన్నారు. ఆయన కేరీర్‌లోనే ఈ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. హీరోయిన్లు నిక్కీగల్రాణి, బిందుమాధవి పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందన్నారు. పలువురు హాస్యనటులు చిత్రంలో నటించడం విశేషమన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం తమకు ఉందన్నారు. చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు