పలాస 1978 మంచి చిత్రమని ధైర్యంగా చెప్పగలం

9 Jan, 2020 02:07 IST|Sakshi
ప్రసాద్, రక్షిత్, తమ్మారెడ్డి భరద్వాజ, కరుణకుమార్, మారుతి

– తమ్మారెడ్డి భరద్వాజ

రక్షిత్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా కరుణకుమార్‌ దర్శకత్వంలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ 2, యూవీ క్రియేషన్స్‌ వచ్చే నెలలో విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘కరుణకుమార్‌ చెప్పింది చెప్పినట్లు తీస్తే తెలుగులో కొత్త రకం సినిమా అవుతుందనిపించింది. చెప్పినదానికంటే బాగా తీశాడు. ఈ సినిమా కోసం అతను దాదాపు 50 రోజులు ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు తెలుసు.

ముందు నేను ఫస్ట్‌ కాపీ చూశాను. ఆ తర్వాత దర్శకుడు మారుతి, నిర్మాత ‘బన్నీ’ వాసు చూశారు. మారుతిగారు అల్లు అరవింద్‌గారిని తీసుకొచ్చారు. ఈ సినిమాకు యూవీ, జీఏ2 పిక్చర్స్‌ అసోసియేట్‌ కావడం వల్ల మంచి పబ్లిసిటీ, థియేటర్స్‌ దొరుకుతాయి. ‘పలాస 1978’ ఒక మంచి చిత్రమని ధైర్యంగా చెప్పగలం’’ అన్నారు. ‘‘నేను, ‘బన్నీ’ వాసు ఈ సినిమా చూసి బాగుందనుకున్నాం. సాధారణంగా ఇలాంటి సినిమాలు తమిళంలో వస్తుంటాయి. ‘పలాస 1978’ చిత్రం తెలుగు ‘అసురన్‌’లా ఉంటుంది. ఇలాంటి గొప్ప సినిమాలు తక్కువగా వస్తుంటాయి.

కరుణకుమార్‌కు సినిమాల పట్ల మంచి ప్యాషన్‌ ఉంది. యూవీ, జీఏ2లో అడ్వాన్స్‌ కూడా ఇప్పించాను’’ అన్నారు మారుతి. ‘‘ఈ సినిమా నాకు భావోద్వేగాలతో కూడిన ప్రయాణంలా సాగింది. మాకు అండగా నిలిచిన గీతా ఆర్ట్స్‌2, యూవీ క్రియేషన్స్‌ సంస్థలకు ధన్యవాదాలు’’ అన్నారు కరుణకుమార్‌. ‘‘మా నాన్నగారి ప్రోత్సాహంతో ఇంత దూరం రాగలిగాం. ఈ సినిమాను చూసిన దర్శకులు సుకుమార్‌గారు ఫోన్‌ చేసి అన్ని వేరియేషన్స్‌ బాగా చేశావని అభినందించారు. గీతా ఆర్ట్స్‌ 2, యూవీ సంస్థలు విడుదల చేస్తున్నాయంటేæ మా సినిమా మరో స్థాయికి వెళ్లిందనిపిస్తోంది. మారుతిగారు మా ముందుండి నడిపించారు’’ అన్నారు రక్షిత్‌.

మరిన్ని వార్తలు