పళ్లి పరవత్తిలే’ ఆడియో ఆవిష్కరణ

19 Sep, 2017 04:16 IST|Sakshi
పళ్లి పరవత్తిలే’ ఆడియో ఆవిష్కరణ

తమిళసినిమా: ఇవాళ సినిమాను విడుదల చేయడం తల్లి పురిటి నొప్పి కంటే ఎక్కువగా మారిందని నటుడు, నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్‌ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు శిర్పి కొడుకు నందన్‌రామ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం పళ్లి పరువత్తిలే. నటి వెంబా నాయకిగా నటించిన ఈ చిత్రంలో దర్శకుడు కేఎస్‌.రవికుమార్, తంబిరామయ్య తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి స్థానిక ట్రిపిల్‌కేన్‌లోని కలైవాణర్‌ ఆవరణలో జరిగింది. ఈ చిత్ర ఆడియోను నాజర్‌ ఆవిష్కరించగా దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్,ఆర్‌బీ.చౌదరి తొలి సీడీని అందుకున్నారు.

ఈ సందర్భంగా నాజర్‌ మాట్లాడుతూ ఇవాళ సినిమాలను నిర్మించడం కష్టం అయితే వాటిని విడుదల చేయడం తల్లి ప్రసవ నొప్పికంటే ఎక్కువగా మారిందన్నారు. అలాంటి వాటిని అధిగమించి చిత్ర పరిశ్రమ విజయం కోసం పోరాడుతోందని అన్నారు. చిత్ర నిర్మాత వేలును తాను అభినందిస్తున్నానన్నారు. పళ్లి పరువత్తిలే చిత్రం పాటలు చాలా బాగున్నాయని, చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ చిత్రాన్ని దర్శకుడు వాసుదేవ్‌ భాస్కర్‌ సహజంగా తెరకెక్కించారని అన్నారు. చిత్ర హీరోహీరోయిన్లు నందన్‌రామ్, వెంబాలను చూస్తూనే ఉండాలనిపించిందన్నారు. ఆ జంటటో ఏదో ఆకర్షణ ఉందన్నారు. చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.