కథ బాగా చెప్పాడు... సినిమా బాగా తీశాడు

23 Jun, 2018 00:32 IST|Sakshi
భాస్కరభట్ల, కె. చక్రవర్తి, గోపీసుందర్, దేవినేని ఉమ, కేకే రాధామోహన్, గోపీచంద్, మెహరీన్‌

గోపీచంద్‌

‘‘ఈ సినిమా స్టార్ట్‌ అవ్వడానికి ఇద్దరు వ్యక్తులు కారణం. ‘చాలా చిత్రాలకు రచయితగా పని చేసిన ఓ కుర్రాడి దగ్గర మంచి కథ ఉంది. ఓసారి విన’మని నాకు చెప్పారు కెమెరామెన్‌ ప్రసాద్‌ మూరెళ్ల, రైటర్‌ రమేశ్‌రెడ్డిగారు. విన్నాను. మొదటి సిట్టింగ్‌లోనే నచ్చింది. కథ బాగా చెప్పారు కానీ సినిమా ఎలా తీస్తారు? అని అడిగాను. ఆ రోజు ఆయనేమన్నా ఫీలయ్యాడేమో తెలియదు కానీ ‘అవకాశం ఇవ్వండి సార్‌ బాగా తీస్తా’ అన్నాడు. చెప్పినట్లే బాగా తీశాడు’’ అన్నారు గోపీచంద్‌.

లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో  గోపీచంద్, మెహరీన్‌ జంటగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కేకే రాధామోహన్‌ నిర్మించిన చిత్రం ‘పంతం’. కె. చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. గోపీసుందర్‌ స్వరకర్త. జూలై 5న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ వేడుక విజయవాడలో జరిగింది. ఈ వేడుకలో ఆడియో బిగ్‌ సీడీని, సీడీని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ విడుదల చేసి, గోపీచంద్‌కు అందచేశారు.

గోపీచంద్‌ మాట్లాడుతూ – ‘‘నేను చేసిన 25 సినిమాల్లో ‘యజ్ఞం’లో మంచి మెసేజ్‌ ఉంటుంది.అలాంటి మెసేజ్‌తోపాటు మంచి కమర్షియల్‌ వేల్యూస్‌ ఉన్న సినిమా ‘పంతం’. ఈ చిత్రం ద్వారా ఓ స్ట్రాంగ్‌ మెసేజ్‌ చెప్పగలిగానని తృప్తిగా ఉన్నాను. రాధామోహన్‌గారు మేకింగ్‌లో కాంప్రమైజ్‌ కాలేదు. గోపీసుందర్‌గారు చక్కని బాణీలతో పాటు మంచి బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించారు’’ అని చెప్పారు. ‘‘మన దేశాన్ని పట్టి పీడించే సమస్యను ఆధారంగా తీసుకొని ఈ  సినిమా చేశాం.

గోపీచంద్‌ 25వ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌’’ అన్నారు రాధామోహన్‌. ‘‘కమాండబుల్‌ యాక్టింగ్,  మంచి వాయిస్‌ ఉన్న హీరో గోపీచంద్‌. మ్యాన్లీగా ఉంటారు. నేను ఓ సీన్‌ రాసుకున్నప్పుడు 70 మార్కులు పడితే నూటికి నూరు మార్కులు పడేలా గోపీచంద్‌ యాక్ట్‌ చేశారు’’ అన్నారు కె. చక్రవర్తి. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా ఎఫ్‌.డి.సీ చైర్మన్‌ అంబికాకృష్ణ, నిర్మాత బీవీయస్‌యన్‌ ప్రసాద్, దర్శకులు సంపత్‌ నంది, బాబి, గోపీచంద్‌ మలినేని తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు