ట్రైలర్, సినిమా చూసి బాగుందన్నా

31 Aug, 2018 01:42 IST|Sakshi
సంతోష్‌ శోభన్, భీమ్స్, జయశంకర్, అల్లు అరవింద్, సుకుమార్, రియా సుమన్, సంపత్‌ నంది

అల్లు అరవింద్‌

‘‘బన్ని ఓ సారి ‘పేపర్‌ బాయ్‌’ ట్రైలర్‌ పంపి చూడమన్నాడు. చూసి చాలా బాగుందన్నా. తర్వాత మెహర్‌ రమేశ్‌ వచ్చి ఈ సినిమా చూడమంటే చూసి, చాలా బాగుంది అన్నాను. మీరు ఈ సినిమాని రిలీజ్‌ చేస్తారా? అన్నాడు మెహర్‌ రమేశ్‌. ఇండస్ట్రీనే నమ్ముకున్న సంపత్‌నందిలాంటి వ్యక్తి ఓ కథ రాసుకుని మరో డైరెక్టర్‌కి అవకాశం ఇచ్చి, మంచి సినిమా చేసినప్పుడు మా సంస్థ ద్వారా విడుదలైతే ప్రేక్షకులకు బాగా రీచ్‌ అవుతుందనే విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు.

సంతోష్‌ శోభన్, రియా సుమన్, తన్య హోప్‌ హీరోహీరోయిన్లుగా జయశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేపర్‌ బాయ్‌’. సంపత్‌ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ మాట్లాడుతూ– ‘‘పేపర్‌ బాయ్‌’ హక్కులను అల్లు అరవింద్‌గారు తీసుకున్నారని చెప్పగానే సినిమా చాలా పెద్ద హిట్‌ అని ఫిక్స్‌ అయిపోయాను. ఎందుకంటే అరవింద్‌గారి జడ్జ్‌మెంట్‌పై నాకు అపారమైన నమ్మకం ఉంది. ఇప్పుడు ఇది పెద్ద సినిమా’’ అన్నారు. ‘‘చిన్న సినిమా నిర్మాతలకు ఉండే కష్టాలేంటో నాకు తెలుసు.‘

పేపర్‌ బాయ్‌’ లాంటి చిన్న సినిమాకు గీతా ఆర్ట్స్‌ వంటి పెద్ద ప్లాట్‌ఫామ్‌ దొరికింది. ఈ చిత్రం పెద్ద హిట్‌ అవుతుంది’’ అన్నారు డైరెక్టర్‌ సుకుమార్‌. ‘‘అరవింద్‌గారు రిలీజ్‌ చేస్తున్నారనగానే ఇదొక మంచి సినిమా అనే గుర్తింపు వచ్చింది. ఆయనకు మా సినిమా గురించి చెప్పిన మెహర్‌ రమేశ్‌ అన్నకు జీవితాంతం రుణపడి ఉంటా’’ అన్నారు సంపత్‌ నంది. ‘‘ఈ సినిమా కోసం ఏడాదిగా కష్టపడుతున్నాం. గీతా ఆర్ట్స్‌వారు మా సినిమాను తీసుకోవడం వల్ల ఈ కష్టం మరచిపోయాం’’ అన్నారు జయశంకర్‌. దర్శకులు మెహర్‌ రమేశ్, కల్యాణ్‌ కృష్ణ, సంతోష్‌ శోభన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు