డబ్బు సంపాదించాలని రాలేదు

5 Sep, 2018 00:20 IST|Sakshi
సుమన్, సంపత్‌ నంది, అన్నపూర్ణమ్మ, జయశంకర్, భీమ్స్‌ 

‘‘కోట్ల రూపాయలు డబ్బు సంపాదించాలని ప్రొడక్షన్‌లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు అవకాశం ఇచ్చింది. కొత్తవారిని ప్రోత్సహించాలనుకుంటున్నా. నాకు ఓపిక ఉన్నంత వరకు ఇది కొనసాగుతుంది’’ అని డైరెక్టర్‌ సంపత్‌నంది అన్నారు. సంతోష్‌ శోభన్, రియా సుమన్‌ జంటగా జయశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పేపర్‌ బాయ్‌’. సంపత్‌నంది, వెంకట్, రాములు, నరసింహులు నిర్మించారు. గీతా ఆర్ట్స్‌ సంస్థ ఆగస్టు 31న ఈ సినిమా విడుదల చేసింది. ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌లో సంపత్‌నంది మాట్లాడుతూ–‘‘మా సినిమాలో స్టార్ట్‌ డైరెక్టర్, స్టార్‌ హీరో లేరు. కానీ, మంచి డీసెంట్‌ టాక్‌ వచ్చింది. మా సినిమా చూసిన వారు మంచి ప్రయత్నం చేశామని ఫోన్‌ చేసి మెచ్చుకోవడంతో చాలా హ్యాపీ ఫీలయ్యాను.

ఒక్క హైదరాబాద్‌లోనే ఏడు థియేటర్స్‌ పెంచాం. ఇందుకు కారణమైన అల్లు అరవింద్‌గారికి థ్యాంక్స్‌. ఈ సినిమా సక్సెస్‌లో సుధాకర్, మురళిల పాత్రలు ముఖ్యమైనవి. వెంకట్, రాములు, నరసింహులు ఉన్నారు కాబట్టే ఇంత దూరం రాగలిగాం. మా సినిమా ఆదరించిన ప్రేక్షకులకు బిగ్‌ థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో అందరం కొత్తవాళ్లమైనా మనసు పెట్టి చేశాం. సంపత్‌నందిగారు బాగా సపోర్ట్‌ చేశారు’’ అన్నారు సంతోష్‌ శోభన్‌. ‘‘పేపర్‌ బాయ్‌’ని సూపర్‌హిట్‌ బాయ్‌గా చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు రియా సుమన్‌. ‘‘సంపత్‌గారు మాకు స్ట్రాంగ్‌ పిల్లర్‌లా నిలబడ్డారు. ఈ జర్నీలో నేర్చుకున్న కొత్త విషయాలు భవిష్యత్‌లో ఉపయోగపడతాయి’’ అన్నారు జయశంకర్‌. నటి అన్నపూర్ణమ్మ, సంగీత దర్శకుడు భీమ్స్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ మురళి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు