తొలి ప్రేమ గుర్తొస్తుంది

19 Aug, 2018 03:17 IST|Sakshi
భీమ్స్, జయశంకర్, సంపత్‌ నంది, సంతోష్‌ శోభన్, రియా సుమన్, నర్సింహులు

సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ , బిఎల్‌ఎన్‌ సినిమాస్, ప్రచిత్ర క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘పేపర్‌ బాయ్‌’. సంతోష్‌ శోభన్, రియా సుమన్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి జయశంకర్‌ దర్శకుడు. భీమ్స్‌ సిసిరేలియో సంగీతాన్ని అందించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. సెప్టెంబరు 7న సినిమా విడుదలవుతుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ చిత్రం ట్రైలర్‌ను చూసి యూనిట్‌ను అభినందించారు.

పేపర్‌బాయ్‌గా పనిచేసే  రవి, బాగా రిచ్‌ ఫ్యామిలీలోని అమ్మాయి ధరణిల ప్రేమకథే ఈ సినిమా. ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమావేశంలో దర్శకుడు–చిత్రనిర్మాతల్లో ఒకరైన సంపత్‌ నంది మాట్లాడుతూ–  ‘‘మా చిత్రం టీజర్‌కు 36 లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. మేం మంచి సినిమా తీశామని గట్టిగా నమ్ముతున్నాను. ‘పేపర్‌బాయ్‌’ మంచి ప్రేమకథ. ఈ సినిమాలో నాతో పాటు ఉన్న రాములు, వెంకట్, నరసింహాకు థ్యాంక్స్‌.

వాళ్లు ఈ సినిమాకు వెన్నెముకలా నిలబడ్డారు’ అన్నారు. దర్శకుడు జయశంకర్‌ మాట్లాడుతూ – ‘‘సంపత్‌ నంది చెప్పిన కథ విన్న వెంటనే కనెక్ట్‌ అయిపోయాను. ఈ విషయంలో నన్ను నమ్మినందుకు సంపత్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు. హీరో సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ– ‘సంపత్‌ నంది గారితో పనిచేయటం నాకు చాలా ప్రత్యేకంతో పాటు మంచి అనుభవం కూడా. సినిమాను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు. హీరోయిన్‌ రియా సుమన్‌ మాట్లాడుతూ– ‘‘దరణి‘ పాత్రలో నటించాను నేను.

ఈ పాత్ర కోసం నన్ను నమ్మినందుకు దర్శకుడు జయశంకర్‌కు థ్యాంక్స్‌. కెమెరామెన్‌ సౌందర్యరాజన్‌గారు మంచి విజువల్స్‌ అందించారు. ‘పేపర్‌బాయ్‌’ సినిమా అందరికీ తమ ఫస్ట్‌లవ్‌ను గుర్తు చేసే మంచి ప్రేమకథ’’ అన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్‌ మాట్లాడుతూ – ‘‘ముందుగా నాకు సినీ జీవితాన్నిచ్చిన సంపత్‌ నందికి కృతజ్ఞతలు. ఈ సినిమాకు ఆత్మ ఆయనే. మీడియా పర్సన్‌ సురేశ్‌ ఉపాధ్యాయ్‌ ఈ చిత్రంలో మూడు పాటలు రాశారు.  చిన్న సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు