మూడేళ్ల కష్టం

19 Nov, 2019 00:20 IST|Sakshi
జీవీవీ గిరి, యోగీశ్వర్, సుమన్‌

యోగీశ్వర్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘పరారి’. ‘రన్‌ ఫర్‌ ఫన్‌’ అనేది ఉపశీర్షిక. సాయి శివాజీ దర్శకత్వం వహించారు. అతిథి హీరోయిన్‌గా నటించారు. ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్‌ పతాకంపై జీవీవీ గిరి నిర్మించారు. మహిత్‌ నారాయణ్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నటుడు సుమన్‌ విడుదల చేశారు. అతిథిగా పాల్గొన్న దర్శకుడు రేలంగి నరసింహా రావు మాట్లాడుతూ– ‘‘యోగీశ్వర్‌ పేరులోనే పవర్‌ ఉంది. ‘పరారి’ చిన్న సినిమా అనుకోవడానికి వీలు లేకుండా ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రం తెరకెక్కించారని తెలుస్తోంది’’ అన్నారు.‘‘చిత్ర నిర్మాత గిరి నాకు అభిమాని మాత్రమే కాదు.. నా కుటుంబ సభ్యుడు. అలాంటి అభిమాని ఉండటం నా అదృష్టం. కుటుంబంతో కలిసి చూసే సినిమా ఇది’’ అన్నారు సుమన్‌.

‘‘ఈ కథ వెనక మూడేళ్ల కష్టం ఉంది. మహిత్‌గారి సంగీతం మా సినిమాకి పెద్ద సపోర్ట్‌గా నిలిచింది’’ అన్నారు సాయి శివాజీ. ‘‘నేను హీరోగా మారడానికి మా నాన్నగారే కారణం. సుమన్‌గారితో కలిసి నటించడం నా అదృష్టం’’ అన్నారు యోగీశ్వర్‌. ‘‘సుమన్‌గారు నా అభిమాన హీరో. ‘పరారి’ చూశాక నా కొడుకు యోగీశ్వర్‌కి అభిమానిగా మారాను’’ అని గిరి అన్నారు. ‘‘చక్రిగారు నాకు అన్నయ్యే కాదు.. గురువు కూడా. ఆయన పేరుని తీసుకొని నేను నా ప్రయాణం మొదలుపెట్టాను’’ అన్నారు మహిత్‌ నారాయణ్‌. ఈ కార్యక్రమంలో నిర్మాతలు దామోదర్‌ ప్రసాద్, రాజ్‌ కందుకూరి, నటుడు శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ‘గరుడవేగ’ అంజి.

మరిన్ని వార్తలు