రౌడీ ముందే అర్జున్‌ రెడ్డిని విమర్శించిన నటి

28 Nov, 2019 14:08 IST|Sakshi

‘అర్జున్‌ రెడ్డి’ విడుదలై రెండేళ్లు అయినా ఆ సినిమాపై వివాదాలు మాత్రం ఇంకా రాజుకుంటూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని కబీర్‌ సింగ్‌ పేరుతో హిందీలోనూ తెరకెక్కించడంతో విమర్శకులు మండిపడిన విషయం తెలిసిందే.  ఈ చిత్రాలపై మలయాళ నటి పార్వతీ మీనన్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఒక నటిగా తానైతే ఆ సినిమాల్లో నటించేదాన్నే కాదంటూ కుండబద్ధలు కొట్టారు. తాజాగా గోవా ఫిల్మ్‌ ఫెస్ట్‌వల్‌ వేదికలో విజయ్‌ దేవరకొండ ఎదురుగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ఒక సినిమా చూస్తే అది విషాదంగా ఉన్నా అక్కడే వదిలేస్తాం. అయితే అర్జున్‌రెడ్డి సినిమాలో హీరో మహిళను చెంపదెబ్బ కొడతాడు. దానికి యూట్యూబ్‌లో వచ్చిన కామెంట్లు చూసి షాకయ్యాను. ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉండి, యువతను ప్రేరేపించేదిగా ఉంది. అయితే ఒక నటిగా ఈ సినిమాలో భాగం కాకుండా మాత్రమే ఉండగలను కానీ దర్శకుడిని సినిమా చేయవద్దని చెప్పలేను’ అని పార్వతి పేర్కొన్నారు. అయితే తనకు ఎదురొచ్చిన వాళ్లను చంపేసుకుంటూ పోయే జోకర్‌ సినిమా మాత్రం వాస్తవాలను చూపించిందనడం గమనార్హం.

నటి పార్వతీ మీనన్‌ వ్యాఖ్యలపై హీరో విజయ్‌ స్పందిస్తూ.. ‘ఈ వార్తలు చూస్తుంటే చిరాకు పుడుతోంది. ప్రేమలో ఉన్నప్పుడు చిన్నపాటి ఘర్షణలు సహజం.. అది ప్రేమజంటకు అర్థమవుతుంది. అయినా దాన్ని ఎందుకు పెద్దదిగా చూస్తున్నారో అర్థం కావట్లేదు. ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. పార్వతిని, ఆమె చేసే పనిని నేను ఇష్టపడతాను. ఆమె ప్రశ్నల వెనుక ఉన్న ఆంతర్యాన్ని నేను అర్థం చేసుకోగలను. కొన్నిసార్లు ఆమె మాటలతో ఏకీభవిస్తాను. కానీ సోషల్‌ మీడియా హడావుడే తనకు చికాకు కలిగిస్తోందన్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావట్లేదు’ అంటూ చివరాఖరకు సోషల్‌ మీడియాపై ఫైర్‌ అయ్యాడు రౌడీ.

మరిన్ని వార్తలు