పవన్‌ ‘జల్సా’ వచ్చి పుష్కరకాలమైంది!

2 Apr, 2020 18:14 IST|Sakshi

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా హిట్టయినా ప్లాఫయినా ఆయనకు ఉండే క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఖుషితో టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన పవర్‌స్టార్‌ ఆ తర్వాత ఏడేళ్ల పాటు విజయం రుచి చూడలేదు. జానీ, గుడుంబా శంకర్‌, బాలు, బంగారం, అన్నవరం వంటి చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి. ఈ సమయంలోనే ఓ క్రేజీ కాంబినేషన్‌కు బీజం పడింది. అప్పుడెవరూ అనుకోలేదు ఈ కాంబినేషన్‌ టాలీవుడ్‌లో నయా రికార్డులను సృష్టిస్తుందని.. సినీ అభిమానుల ఆలోచనల్లో మార్పులు తీసుకొస్తుందని.. ఆ జోడీయే పవన్‌-త్రివిక్రమ్‌. పవన్‌ క్రేజ్‌.. త్రివిక్రమ్‌ మాటలు.. దేవిశ్రీప్రసాద్‌ పాటలు ఇవన్నీ కలగలపి వచ్చిన చిత్రం ‘జల్సా’ . గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మించిన ఈ చిత్రం విడుదలై నేటికి పన్నెండేళ్లు పూర్తయింది. 

పవన్‌ కల్యాణ్‌-ఇలియానల మధ్య వచ్చే లవ్‌ సీన్స్‌, పవన్‌-బ్రహ్మానందం, ప్రకాష్‌ రాజ్‌ కామెడీ సీన్స్‌, సినిమా ప్రారంభంలో మహేశ్‌ బాబు వాయిస్‌ ఓవర్‌, సినిమాలో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో సమాజంపై కోపంతో నక్సలైట్‌ పాత్రలో చెగువేరా గెటప్‌లో పవన్‌ కనిపించడం ఇవన్నీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అంతేకాకుండా ప్రతీ సీన్‌లోనూ త్రివిక్రమ్‌ తన మ్యాజిక్‌ చూపించాడు. ఇక తివిక్రమ్‌ అంటేనే ఆలోచింపజేసే మాటలు, డైలాగ్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌ అన్న విషయం తెలిసిందే. ‘యుద్దం గెలవడం అంటే శత్రువును చంపడం కాదు.. ఓడించడం’అంటూ పవన్‌ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు థియేటర్‌లో ఈలలు వేయించాయి. అంతేకాకుండా దేవిశ్రీప్రసాద్‌ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాను మరో మెట్టుపై నిలిచేలా చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అనేక రికార్డులను తిరగరాసింది. అంతేకాకుండా ఎక్కువ థియేటర్లలో వందరోజులు పూర్తి చేసుకుని ఘన విజయం సాధించింది. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు లాక్‌డౌన్‌ నేపథ్యంలో కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు కదా అందరూ కలిసి మరోసారి జల్సా చూసి ఎంజాయ్‌ చేయండి. 

చదవండి:
చిరంజీవికి జేజేలు: పవన్‌ కళ్యాణ్‌
‘బాహుబలి’ని బ్రేక్‌ చేసిన మహేశ్‌ చిత్రం

మరిన్ని వార్తలు