పవర్ స్టార్ క్లారిటీ ఇచ్చేశాడు

27 May, 2016 09:23 IST|Sakshi
పవర్ స్టార్ క్లారిటీ ఇచ్చేశాడు

సర్ధార్ గబ్బర్సింగ్ సినిమాతో నిరాశపరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే సినిమాల నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్న పవన్, ఈలోగా వీలైనన్ని ఎక్కువ  సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు. అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టేశాడు. ఈ సినిమాలతో తన సన్నిహితులకు మేలు జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం శరత్ మరార్ నిర్మాత ఎస్ జె సూర్య దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు పవన్. ఈ సినిమాతో నిర్మాతగా నష్టాలను ఎదుర్కొన్న శరత్ మరార్తో పాటు, కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్న ఎస్ జె సూర్యకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడు. మరోసారి ఖుషి లాంటి భారీ హిట్తో అభిమానులన అలరించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఆ తరువాత, దాసరి నారాయణరావుకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాకు అంగీకరించాడు. ఈ రెండు సినిమాలతో పాటు తనకు గబ్బర్సింగ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చి, తరువాత పెద్దగా ఆకట్టుకోలేకపోయిన హరీష్ శంకర్తోనూ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాను ఎఎమ్ రత్నం బ్యానర్లో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇలా గతంలో తనకు సాయం చేసిన వారందరికీ తిరిగి సాయం చేస్తున్నాడు పవర్ స్టార్.