పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌?

20 Jan, 2020 19:47 IST|Sakshi

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ట్విటర్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. ‘అజ్ఞాతవాసి’  తర్వాత రాజకీయాలతో బిజీ అయిన పవన్‌ సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. అయితే పవర్‌ స్టార్‌ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘పింక్‌’ను తెలుగులో దిల్‌ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఓ మై ఫ్రెండ్, ఎమ్‌సీఏ’ చిత్రాల ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్నాడు. ఇక హిందీ ‘పింక్‌’లో అమితాబ్‌ బచ్చన్‌ పోషించిన లాయర్‌ పాత్రను తెలుగులో పవన్‌ కల్యాణ్‌ చేస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై పవన్‌ వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

అయితే పవన్‌ కళ్యాణ్‌కు సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫోటోలను పరిశీలిస్తే.. షూటింగ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్‌లో పవన్‌ పాల్గొన్నారని తెలుస్తోంది. సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు మరోటాక్‌. అయితే ఈ చిత్ర విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒక వేళ ఈ ఫోటోలు నిజమై ఆయన షూటింగ్‌లో పాల్గొంటే పవన్‌ ఫ్యాన్స్‌కు నిజంగా పండగే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్‌కు ఇది 26వ చిత్రం కావడంతో ట్విటర్‌లో ‘#PSPK26’ హ్యాష్‌ ట్యాగ్‌ తెగ ట్రెండ్‌ అవుతోంది.  ఇక పింక్‌ రిమేక్‌తో పాటు క్రిష్‌, పూరి జగన్నాథ్‌లతో కూడా సినిమాలు చేసేందుకు పవన్‌ ప్లాన్‌ చేస్తున్నారని సమచారం.

మరిన్ని వార్తలు