గబ్బర్‌సింగ్ మళ్లీ గుర్రం ఎక్కుతున్నాడు!

17 Feb, 2014 00:34 IST|Sakshi
గబ్బర్‌సింగ్ మళ్లీ గుర్రం ఎక్కుతున్నాడు!
 ‘ఓ మైగాడ్’ తెలుగు రీమేక్‌లో పవన్‌కల్యాణ్ నటించనున్నారు. ఇటీవల ఈ వార్త వెలుగు చూసింది. అంతకు ముందే.. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వారితో పవన్ భారీ డీల్ కుదుర్చుకున్నారని, ఆ సంస్థ నిర్మించబోయే చిత్రాల్లో పవన్ నటించబోతున్నారని ఓ వార్త మీడియాలో హంగామా చేసింది. పవర్‌స్టార్‌ని కేంద్రంగా చేసుకుని పుట్టుకొస్తున్న ఈ వార్తల మధ్య ‘గబ్బర్‌సింగ్-2’ నిజంగా నలిగిపోతున్నాడు. అసలు ఆ సినిమా ఉన్నట్టా? లేనట్టా? స్క్రిప్ట్ వర్క్ మొదలైంది.
 
  సంపత్‌నందిని దర్శకునిగా తీసుకున్నారు. మరి ఉన్నట్లుండి పవన్‌కి ఈ కొత్త కమిట్‌మెంట్లేంటి? ఇప్పుడు ఫిలింనగర్‌లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎట్టకేలకు ఆ చర్చకు తెర పడింది. ‘గబ్బర్‌సింగ్’ రెండోసారి గుర్రం ఎక్కేస్తున్నాడు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి నిర్మాత శరత్ మరార్ సన్నాహాలు చేస్తున్నారు. మార్చిలో కానీ, ఏప్రిల్‌లో కానీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. వీలైతే... ‘ఓ మైగాడ్’ తెలుగు రీమేక్‌కు సమాంతరంగా ‘గబ్బర్‌సింగ్-2’ షూటింగ్‌ను కూడా జరపాలని శరత్ మరార్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.