ఈ కిక్కే వేరప్పా!

6 Nov, 2016 01:05 IST|Sakshi
ఈ కిక్కే వేరప్పా!

హిట్ కాంబినేషన్‌లో కొత్త సినిమాకి కొబ్బరికాయ కొడితే.. సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతారు. అందులోనూ పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఆ కిక్కే వేరు. ఇప్పటివరకూ పవన్‌కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రం రూపొందుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ చిత్రం శనివారం ఉదయం 10 గంటల 49 నిమిషాలకు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
 
  ‘‘డిసెంబర్‌లో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. సినిమాలో పవన్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. త్వరలో నటీనటుల వివరాలు ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత. పవన్‌కల్యాణ్, చిత్ర దర్శక-నిర్మాతలతో పాటు నిర్మాతలు శరత్ మరార్, సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమేరా: వి.మణికందన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పీడీవీ ప్రసాద్, సమర్పణ: శ్రీమతి మమత.