‘‘మహేశ్బాబు ఎవరో తెలీదని నేనెప్పుడూ అనలేదు.. ఆయన తెలియదని చెబితే నాకంటే పెద్ద ఇడియట్ మరొకరుండరు’’ అంటున్నారు పాయల్ ఘోష్. ‘ప్రయాణం, ఊసరవెల్లి, మిస్టర్ రాస్కెల్’ వంటి చిత్రాలతో తెలుగు పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు పాయల్. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్, కన్నడ చిత్రాల్లో నటిస్తున్న ఆమె ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
హీరో ఎన్టీఆర్ అభిమానులు – హీరోయిన్ మీరా చోప్రా వివాదం, హీరో సుశాంత్ సింగ్ మరణం, నెపోటిజం.. వంటి విçషయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నారామె. ఈ లాక్డౌన్ సమయంలో తన అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న ఆమె పలువురి హీరోలపై తన అభిప్రాయాన్ని చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు.
‘హీరో మహేశ్బాబు ఎవరో నాకు తెలియదంటూ మీరు (పాయల్ ఘోష్) చెప్పారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి’ అంటూ చిట్చాట్లో భాగంగా ఓ నెటిజన్ ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు పాయల్ స్పందిస్తూ– ‘‘టాలీవుడ్లో నాకు ఇష్టమైన హీరోల్లో మహేశ్బాబు ఒకరు. అలాంటిది ఆయన తెలియదని నేనెలా చెబుతాను? ఆయన ఎవరో తెలీదని నేనెప్పుడూ అనలేదు. దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని మీడియాను కోరుతున్నా. అసత్యమైన వార్తలు కాకుండా ప్రేమను, పాజిటివిటీని పంచండి’’ అని కోరారు.