బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌పై నటి వివాదాస్పద వ్యాఖ్యలు

3 Oct, 2019 15:52 IST|Sakshi

న్యూఢిల్లీ : అత్యంత ప్రజాదరణ పొందిన వివాదాస్పద రియాల్టీ షో బిగ్‌బాస్‌పై  సీజన్‌ టూ లో పాల్గొన్న కంటెస్టెంట్‌, నటి పాయల్‌ రోహ్తగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్‌ 29న హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13 అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఈ షోలో గతం కంటే భిన్నంగా ఈసారి అందరూ సెలబ్రిటీలే కావడం గమనార్హం. ఈ షోలో పాల్గొంటున్న అమీషా పటేల్‌, కొయినా మిత్రా, సిద్ధార్థ శుక్లా, రేష్మీ దేశాయ్‌, అబూ మాలిక్‌లపై పాయల్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

తాజా సీజన్‌లో పాల్గొంటున్న అమీషా పటేల్‌, కొయినా మిత్రా, రేష్మి దేశాయ్‌, సిద్ధార్ధ్‌ శుక్లా, అబూ మాలిక్‌..వీరందరికి ఇప్పుడు ఎలాంటి పనిలేకపోవడంతో కేవలం డబ్బు సంపాదించేందుకే బిగ్‌బాస్‌ 13 సీజన్‌లో పాల్గొంటున్నారని, ఇక ఇతరులకు ఏమాత్రం పేరు ప్రతిష్టలు లేకపోవడంతో తక్కువ మనీకే షోలో పాల్గొంటున్నారని పాయల్‌ చౌకబారుగా వ్యాఖ్యానించారు. తాను బిగ్‌బాస్‌ 2లో పాల్గొన్న సందర్భంలో తనకూ ఎలాంటి పని లేదని ఆమె ట్వీట్‌లో చెప్పుకొచ్చారు. కాగా పాయల్‌ వ్యాఖ్యలపై నెటిజన్లు పెద్దసంఖ్యలో ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు