వెస్టిండీస్‌ క్రికెటర్‌తో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్‌

29 Jun, 2019 15:30 IST|Sakshi

వెస్టిండీస్‌ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావోతో ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ షార్ట్ ఫిలింను నిర్మించనుంది. ఈ విషయాన్ని సంస్థ అధినేత టీజీ విశ్వ ప్రసాద్‌ వెల్లడించారు. ఈ సంస్థ ప్రస్తుతం స‌మంత అక్కినేని ప్రధాన పాత్రలో ఓ బేబి, విక్టరీ వెంక‌టేష్, నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ, అనుష్క‌, మాధ‌వ‌న్, కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌స‌న్ కాంబినేష‌న్లో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ సైలెన్స్, నాగశౌర్యతో మరో సినిమాను నిర్మిస్తోంది.

ఈ సంస్థ మరో ముందడుగు వేసి ప్రపంచ ప్రఖ్యాత వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్‌ బ్రావోతో, తమ సంస్థ ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CRS)లో భాగంగా ఓ షార్ట్ ఫిలింను నిర్మించబోతోంది. దీనికి సంబంధించి శనివారం ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బ్రావోతో పాటు చిత్ర నిర్మాత  టీజీ విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నటరాజ్ పిళ్ళైలు పాల్గొన్నారు.

సోషల్ అవేర్నెస్‌కు సంబంధించి రూపొందే ఈ లఘు చిత్రం కోయంబత్తూర్, తమిళనాడుతో పాటు వెస్టిండీస్‌ లోని ట్రినిడాడ్, టొబాగోలలో చిత్రీకరణ జరుపుకుంటుంది. రేపటినుంచి కోయంబత్తూర్‌లో షూటింగు ప్రారంభమవుతుందని, మరిన్ని వివరాలను త్వరలోనే మీడియాకు తెలుపుతామన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌.

>
మరిన్ని వార్తలు