ప్రతిభను ప్రోత్సహించాలి – సురేశ్‌బాబు

16 Dec, 2016 23:48 IST|Sakshi
ప్రతిభను ప్రోత్సహించాలి – సురేశ్‌బాబు

‘సురేశ్‌ ప్రొడక్షన్స్‌ స్థాపించి 52ఏళ్లయింది. ఈ జర్నీలో ఎంతో మంది కొత్తవారిని పరిచయం చేశాం. వారంతా సక్సెస్‌ అయ్యారు. ‘పిట్టగోడ’ చిత్రం ద్వారా ప్రతిభ ఉన్న మరికొంత మంది కొత్తవాళ్లను పరిచయం చేస్తున్నాం’’ అని నిర్మాత, చిత్ర సమర్పకుడు డి.సురేశ్‌ బాబు అన్నారు. విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవి భూపాలం జంటగా అనుదీప్‌ కె.వి.దర్శకత్వంలో దినేష్‌ కుమార్, రామ్మోహన్‌ పి. నిర్మించిన ఈ చిత్రం నాలుగో పాటను సురేశ్‌ బాబు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ఎంతో మంది కొత్తవాళ్లను రామ్మోహన్‌ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.

ఇలా చేయడం వల్లే ప్రతిభ ఉన్న కొత్తవారు బయటికి వస్తారు. ఈనెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘రామానాయుడుగారు, సురేశ్‌గారు కొత్తవాళ్లను ఎంకరేజ్‌ చేసి పలు చిత్రాలు నిర్మించారు. వారి స్ఫూర్తితోనే న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తున్నా. మా బ్యానర్‌ లో స్వాతి తర్వాత ‘పిట్టగోడ’ ద్వారా మరో తెలుగమ్మాయి పునర్నవిని హీరోయిన్‌ గా పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది’’ అని రామ్మోహన్‌ అన్నారు. ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అనుదీప్‌ ఓ సరదా సన్నివేశాన్ని బేస్‌ చేసుకుని ‘పిట్టగోడ’ కథ తయారు చేసుకున్నారు.