ప్లాన్‌ ఏంటి?

16 Apr, 2019 03:31 IST|Sakshi

మహేంద్ర, మమత కులకర్ణిలను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ నూతనదర్శకుడు బి.ఎల్‌.ప్రసాద్‌ తెరకెక్కించిన చిత్రం ‘ప్లానింగ్‌’. అలీషా ప్రత్యేక పాత్రలో నటించారు. సాయి గణేష్‌ మూవీస్‌ పతాకంపై టి.వి. రంగసాయి నిర్మించిన ఈ సినిమాకి ఉదయ్‌ కిరణ్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం పాటలను  నిర్మాత సి. కళ్యాణ్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘విజువల్స్, పాటలు బాగున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే వ్యత్యాసం లేకుండా ప్రస్తుతం మంచి సినిమాలు తీస్తున్నారు. మహేంద్ర చక్కగా నటించారు. రంగసాయి కళాతృష్ణతో  సినిమాలు తీస్తున్నారు. ఆయన మరిన్ని చిత్రాలు చేయాలి’’ అన్నారు.

‘‘దర్శక–నిర్మాతలు ఎంతో చక్కని ప్లానింగ్‌తో చేసిన సినిమా ఇది’’ అన్నారు కొరియోగ్రాఫర్, హీరో మహేంద్ర. ‘‘ఐటమ్‌ సాంగ్‌తో కెరీర్‌ ప్రారంభించిన నేను కథానాయిక అయ్యాను. దక్షిణ భారతదేశంలో అన్ని భాషల్లో సినిమాలు చేశాను’’ అన్నారు మమత కులకర్ణి. ‘‘మాకు వెన్నుదన్నుగా నిలిచిన కళ్యాణ్‌గారు, స్నేహితులందరికీ ధన్యవాదాలు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో క్షుణ్ణంగా చెక్‌ చేసుకుని స్క్రిప్టును ఫైనలైజ్‌ చేసి, సినిమా తీశాం’’ అన్నారు రంగసాయి. ఈ వేడుకలో నిర్మాతలు రామ సత్యనారాయణ, సాయి వెంకట్, దర్శకుడు భాను కిరణ్, సంగీత దర్శకుడు ఉదయ్‌ కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: బి. ధనుంజయ్, బి. దేవి, నిర్వహణ: బి.భూలక్ష్మి.

మరిన్ని వార్తలు