నట్టికుమార్‌ కుమారుడిపై పోలీసుల దాడి

1 Jan, 2020 09:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సినీ నిర్మాత నట్టికుమార్‌ కుమారుడు క్రాంతిపై పోలీసులు దాడికి దిగారు. సాయం అడిగిన అతనిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన బేగంటపేట కంట్రీ క్లబ్‌ వద్ద చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న నట్టికుమార్‌.. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు చేరకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కారు కనిపించకపోవడంతో 100కు ఫోన్‌ చేస్తే దాడి చేస్తారా అంటూ పోలీసులను ప్రశ్నించారు. దీంతో అర్ధరాత్రి పంజాగుట్ట పీఎస్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే పోలీసులు క్షమాపణలు చెప్పడంతో నట్టికుమార్‌ శాంతించారు. పోలీసులతో మాట్లాడి తన కుమారుడిని తీసుకెళ్లారు. 
 
ఈ సందర్భంగా నట్టికుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. కంట్రీ క్లబ్‌ ఈవెంట్‌ మేనేజర్‌ సుమన్‌ ఇయర్‌ ఎండ్‌ సెలబ్రేషన్‌ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు నమ్మబలికి చాలా మందిని మోసం చేశాడని ఆరోపించారు.  అతన్ని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశాడు. తన కుమారుడిపై దాడి ఘటనకు పోలీసులు క్షమాపణ చెప్పారని వెల్లడించారు. కాగా, కంట్రీ క్లబ్‌ వద్ద కారు పార్క్‌ చేస్తామని చెప్పి కీ తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో క్రాంతి 100కు ఫోన్‌ చేసినట్టుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు