రంగోలికి మద్దతు.. కంగనా రనౌత్‌పై కేసు

24 Apr, 2020 16:11 IST|Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌పై కేసు నమోదైంది. ముంబైకి చెందిన అడ్వకేట్‌ అలీ కాషిఫ్‌ ఖాన్‌ దేశ్‌ముఖ్‌ కంగనాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజులక్రితం ఉత్తరప్రదేశ్‌లోని  మొరదాబాద్‌లో కరోనాతో మృతి చెందిన ఓ జమాతీ కుటుంబానికి వైద్య పరీక్షలు చేయటానికి వెళ్లిన డాక్టర్లు, పోలీసులపై వారు దాడి చేశారు. ఈ సంఘటనపై స్పందించిన రంగోలి చందేల్‌ ఓ వర్గానికి చెందిన వారిని, సెక్యులర్‌ మీడియాను వరుసగా నిలబెట్టి కాల్చిపడేయాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో రంగోలి చందేల్‌ ట్విటర్‌ ఖాతాను అధికారులు తొలగించారు.

ఈ నేపథ్యంలో కంగనా స్పందిస్తూ కొద్దిరోజులక్రితం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు. తన సోదరి రంగోలి చందేల్‌‌ ట్విటర్‌ ఖాతాను తొలిగించటాన్ని ఆమె తప్పుబట్టారు. గతంలో రంగోలి చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు. అంతేకాకుండా సదరు వర్గానికి చెందిన వారిని టెర్రరిస్టులని కంగనా పేర్కొన్నారు. ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో అలీ పోలీసులను ఆశ్రయించారు. ( రంగోలి ట్విటర్‌ బ్లాక్‌; ఖండించిన సింగర్‌ )

>
మరిన్ని వార్తలు