జ్యోతికపై పోలీసులకు ఫిర్యాదు

17 Feb, 2018 09:28 IST|Sakshi
నటి జ్యోతిక

సాక్షి, చెన్నై : నటి జ్యోతికపై హిందూ మక్కళ్‌ కట్చి నేతలు పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం నాచియార్‌. బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని కొన్ని  సంభాషణలపై ఇంతకు ముందే తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పలు సంఘాల వ్యతిరేకతతో ఆ సన్నివేశాల్లోని సంభాషణలను చిత్ర వర్గాలు బీప్‌ చేశారు. ఈ నేపథ్యంలో నాచియార్‌ చిత్రం నిన్న (శుక్రవారం) విడుదల అయింది.

అందులోని మరి కొన్ని సన్నివేశాలు వివాదానికి తెరలేపాయి. దీంతో హిందూ మక్కళ్‌ కట్చి ప్రచార విభాగ అధ్యక్షుడు కాళీకుమార్‌ నిన్న  చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నాచియార్‌ చిత్రంలో జ్యోతిక ఒక సన్నివేశంలో ‘మాకు ఆలయాలయినా, చెత్తకుప్పలు అయినా ఒకటే’  అంటూ  మాట్లాడిన సంభాషణలు హిందూ దేవాలయాలను అవమానించేవిగానూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సంభాషణలను వెంటనే తొలగించి, జ్యోతిక, దర్శకుడు బాలాపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు