హింసను బయటకు చెప్పకూడదా?

7 Oct, 2018 01:55 IST|Sakshi
పూజా భట్‌

‘‘అందరూ తమ బాధను మర్చిపోవడానికో, తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టడానికో లైంగిక వేధింపుల గురించి బయటకు మాట్లాడుతున్నారు. నేను ఒకప్పుడు మద్యానికి బానిస అయిన ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉండేదాన్ని. అతన్ను నన్ను శారీరకంగా హింసించే వాడు. ఆ హింసను బయటకు చెప్పడానికి నేను మొహమాటపడలేదు, భయపడలేదు’’ అని బాలీవుడ్‌ నటి, దర్శకురాలు, నిర్మాత, ప్రముఖ దర్శకుడు మహేశ్‌ భట్‌ తనయ పూజా భట్‌ పేర్కొన్నారు.

‘మీటూ’ ఉద్యమం ఎవ్వరికీ వినిపించని గోడులను నిర్భయంగా బయటకు చెప్పుకునే అవకాశం తీసుకువచ్చింది. ప్రపంచంలోని అన్ని మూలలా ఉన్న ప్రతి ఒక్కరూ తమపై జరిగిన లైంగిక వేధింపులను బయటకు చెప్పుకోగలుగుతున్నారు. కేవలం వాళ్ల బాధను వెలిబుచ్చుకోవడం కోసమే కాదు. ఇలాంటివి మళ్లీ జరక్కుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా ఈ ఉద్యమం సాగుతోంది. తాజాగా ఈ ఉద్యమంలో తన గొంతునూ వినిపించారు పూజా భట్‌. లైంగిక వేధింపుల గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి.

కానీ మన ఇళ్లలో, మన పడకగదుల్లో మార్పు వచ్చే వరకూ ఏ మార్పు రాదు. కేవలం అబద్ధాలకే అలవాటు పడ్డ ప్రపంచంలో నువ్వు నమ్మలేని నిజాలు చెప్పినప్పుడు ప్రజలు చెవిటివారిలా నటించడంలో ఆశ్చర్యం లేదు. మార్పు గురించి అందరం మాట్లాడతాం తప్పితే ఆ దిశగా ఎవ్వరం నడవం. మన ఇంట్లో సురక్షితమైన వాతావరణం ఉంటే ప్రపంచం 90 శాతం శాంతియుతంగా మారిపోతుంది. ఎందుకంటే 90 శాతం వేధింపులు మన ఇంట్లోనే జరుగుతాయి కాబట్టి.  నా సమస్య గురించి బయటకు చెప్పినప్పుడు ఎందుకు ఇంట్లో సమస్యను పబ్లిక్‌లో పెడుతున్నావేంటి? అన్నారు. మహేశ్‌ భట్‌ కూతుర్ని కాబట్టి నాకు బాధ తక్కువగా ఉంటుందా? హింసను బయటకు చెప్పకూడదా’’ అన్నారు పూజా.

మరిన్ని వార్తలు