‘ఓసారి గట్టిగా ప్రయత్నిద్దాం అనుకున్న.. అంతే!’

15 Feb, 2020 10:28 IST|Sakshi

ప్రస్తుతం తెలుగులో వరుస హిట్‌లతో దూసుకుపోతూ.. టాప్ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయారు పూజా హెగ్డే. నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగు పెట్టిన పూజా తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతీక్‌ రోషన్ సరసన చారిత్రాత్మక చిత్రం ‘మొహంజదారో’లో నటించారు. ఆ సినిమా కోసం దాదాపు రెండేళ్లపాటు బాలీవుడ్‌కే అంకితమైపోయారు. అయితే అందులో రాణిగా నటించినప్పటికీ బాలీవుడ్‌లో పూజాకు అంతగా గుర్తింపు రాకపోవడంతో మళ్లీ టాలీవుడ్‌కు వచ్చేశారు. తర్వాత వరణ్‌తేజ్‌తో ‘ముకుంద’, అల్లు అర్జున్ సరసన 'డీజే' ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత' మహేష్‌ బాబుతో ‘మహర్షి’లో నటించి టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నారు. ఇటీవల ఈ భామ బన్నీతో మరోసారి 'అల వైకుంఠపురములో' నటించి మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న​ సంగతి తెలిసిందే. అలా వరుస హిట్లతో ఊపు మీదున్న  ఈ బ్యూటీ తాజాగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సరసన నటించే బంపర్‌ ఆఫర్‌ను కొట్టేశారు.

సల్మాన్‌తో నటించే ఛాన్స్‌ కొట్టేసిన పూజా

ఈ నేపథ్యంలో పూజా తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘సవాలుతో కూడుకునే నిర్ణయాలు తీసుకునేందుకు నేను ఎప్పుడూ ముందుంటాను. జీవితంలో సాహసాలు చేయడం చాలా అవసరం. అవే మనల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. మనిషి సుఖంగా జీవించడంలోనే ఆనందం ఉందనుకుంటారు. అందుకోసం.. ఒకే రకమైన లైఫ్‌కు అలవాటు పడిపోతుంటారు. అలా బతకడంలో తప్పు లేదు.. కానీ మనకంటూ ఓ గుర్తింపు రావాలంటే.. పదిమంది కంటే భిన్నంగా ఆలోచించాలి’ అని చెప్పుకొచ్చారు. అంతేగాక కొత్తగా ప్రయత్నాలు చేసేటప్పుడు ఆ ప్రయాణంలో మనకు ఎన్నో ఎదురుదెబ్బలు తగలొచ్చు  వాటిని తట్టుకుని నిలబడినప్పుడే ఇతరులు మనల్ని గుర్తించే స్థాయికి ఎదుగుతామని ఆమె అన్నారు.

పూజాహెగ్డే లుక్‌కి అభిమానులు ఫిదా

అదే విధంగా సినిమాలు నాకేందుకులే అని అనుకుని ఉంటే మిగతా అమ్మాయిల్లానే తాను చదువు, ఉద్యోగం అంటూ మిగిలిపోయేదాన్నని... కాని ఓసారి ట్రై చేసి చూద్దాం అని గట్టిగా అనుకున్నానని చెప్పారు. అయితే.. ఈ ప్రయాణంలో మొదట కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ చివరికి మాత్రం నా గమ్యాన్ని చేరుకున్నానన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ అఖిల్‌తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో నటిస్తుంది. ఇక ప్రభాస్‌ సరసన ఓ సినిమా నటించనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు