ఎన్‌కౌంటర్‌ : పవన్‌పై పూనమ్‌ కౌర్‌ సంచలన వ్యాఖ్యలు

7 Dec, 2019 08:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దిశ నిందితుల్ని తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నారు. దిశకు న్యాయం జరిగిందంటూ సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దిశ ఎన్‌కౌంటర్‌పై సిని నటి పూనమ్‌ కౌర్‌ స్పందించారు. దిశ నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దిశ నిదితుల్ని ఎన్ కౌంటర్ చేయటం అభినందనీయమని ఆమె సంతోషం వ్యక్తంచేశారు. దిశ ఘటన తెలిసి తానుఎంతో ఆవేదన చెందాననీ.. ఆందోళన చెందానని కానీ.. నిందితులకు ఇంత త్వరగా శిక్ష వేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడినవారికి ఇదే సరైన శిక్ష అని అన్నారు. ఇక ఏ ఆడపిల్లకు ఇటువంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులకు..ప్రభుత్వాలకు ఉందన్నారు.

ఇలా పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూనే.. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేసింది పూనమ్. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన పూనమ్.. ఆ తరువాత కాసేపటికే డిలీట్ చేసింది. అయితే ఆ లోపే ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌లో ఏముందంటే...‘ ఉదయమే మంచి వార్త విన్నాను. దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ సీఎం, తెలంగాణ డీజీపీకి ధన్యవాదాలు. ఇదే విధంగా నాతో పాటు పలువురి మహిళలను మోసం చేసిన కొంతమంది సినీ అలియాస్ రాజకీయ నాయకులను శిక్షిస్తారని భావిస్తున్నా. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు’’ అని పూనమ్ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌లో పవన్ కల్యాణ్‌ పేరును ప్రత్యక్షంగా వాడనప్పటికీ.. ఇటీవల కాలంలో ఆయన మాట్లాడిన మాటలను కామెంట్ చేసింది. దీంతో ఆమె ట్వీట్‌ పవన్‌కేనని అందరికీ అర్థమైంది. 

కాగా, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనపై పవన్‌ స్పందిస్తూ.. ‘వైద్యురాలిపై హత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి.. ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారు.అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు. ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు తగిలిస్తే సరిపోతుంది’  అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు