నా కల నెరవేరింది: హీరోయిన్

10 Sep, 2016 08:34 IST|Sakshi
నా కల నెరవేరింది: హీరోయిన్

కోర్టులో న్యాయ విచారణ జరుగుతున్నప్పుడు న్యాయవాదులు జడ్జిని గౌరవంగా యువరానర్ అంటుంటారు. కథానాయిక పూనమ్ కౌర్ కూడా ఇప్పుడు అలానే అంటున్నారు. తొలిసారి ఆమె లాయర్‌గా నటిస్తోన్న చిత్రం ‘ప్రణయం’. దిలీప్, పూనమ్ కౌర్, అక్షిత ప్రధాన పాత్రల్లో శ్రీ విజయానంద్ పిక్చర్స్ పతాకంపై జీయస్‌వీ సత్యప్రసాద్ దర్శకత్వంలో ఎ.నరేందర్, విజయానంద్, సురేష్ గౌడ్ నిర్మిస్తోన్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రఘుబాబు కెమేరా స్విచాన్ చేయగా, నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ ఇచ్చారు.
 
నిర్మాత గుణ్ణం గంగరాజు స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇదొక సిన్సియర్ లవ్‌స్టోరీ. యువతరంతో పాటు అన్ని వర్గాల వారికీ నచ్చేలా తెరకెక్కిస్తాం. పూనమ్ కౌర్ లాయర్ పాత్రలో కనిపిస్తారు. ఆమె పాత్ర ఈ చిత్రానికి హైలెట్. దిలీప్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాం. సహ నిర్మాత నరేందర్ సహకారంతోనే ఈ చిత్రం చేయగలుగుతున్నాం’’ అని చెప్పారు. ‘‘నా పాత్రను దర్శకుడు బాగా డిజైన్ చేశారు.
 
రియల్ లైఫ్‌లో లాయర్ కావాలనుకుని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాశా. కానీ సెలెక్ట్ కాలేదు. ఎందుకంటే నేనంత తెలివైనదాన్ని కాదు. ఇప్పుడు రీల్ లైఫ్‌లో లాయర్ పాత్ర చేయడంతో నా రియల్ డ్రీమ్ నెరవేరినట్లనిపిస్తోంది’’ అని పూనమ్‌కౌర్ తెలిపారు. దిలీప్, అక్షిత, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: రామ్‌కుమార్, సంగీతం: కేయం రాధాకృష్ణ, నిర్మాణ, నిర్వహణ: యండీ సలీమ్.