లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

16 Jul, 2019 06:26 IST|Sakshi

చెన్నై ,పెరంబూరు: ప్రముఖ సినీ నటుడు, కొరియోగ్రాఫర్‌ లారెన్స్‌ను కలవడానికి వచ్చిన కుటుంబం ప్రస్తుతం భిక్షమెత్తుతూ జీవిస్తున్నారు. కన్న కొడుకుకు వైద్య సాయం కోరడానికి వచ్చిన ఆ అభాగ్యులు చెన్నై ఎగ్మూర్‌ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌పామ్‌పై భిక్షమెత్తుకుని జీవించుకుంటున్నారు. వారి దీనగాథ పలువురిని కదిలిస్తోంది. వివరాలు రాజపాళైయంకు చెందిన యువతి గృహలక్ష్మీ. ఆమె సోదరుడు వెంకటేశన్‌. గృహలక్ష్మీ పెళ్లి జరిగింది. కొడుకు పుట్టాడు. దీంతో మేనమామ వెంటకేశన్‌ ఆనందంతో పొంగిపోయాడు. ఆ అనందం ఎంతో కాలం నిలవలేదు. గృహలక్ష్మీ కొడుకు పేరు గురుసూర్య. అయితే ఆ పిల్లాడు రెండేళ్ల వయసు వరకూ నడవలేక పోయాడు మాటలు రాలేదు. అంతే కాదు  కాలం గడుస్తున్న కొద్ది గృహలక్ష్మీ మరింత క్షోభను కలిగించే సంఘటన జరిగింది.

ఆమె కొడుకు గుండె జబ్బు బయటపడింది. దీంతో ఆమె కొడుకును కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. చాలా ఆస్పత్రులకు వెళ్లింది. అయినా ప్రయోజనం లేకపోయ్యింది. మరో పక్క భర్త వదిలి వెళ్లిపోయాడు. గృహలక్ష్మీకి ఎం చేయాలో, తన కొడుకును ఎలా కాపాడుకోవాలో పాలు పడలేదు. సోదరి  బాదను చూడలేక వెంకటేశన్‌ తన పెళ్లిని త్యాగం చేసి అక్కకు అండగా నిలిచాడు. అలాంటి పరిస్థితుల్లో ఎవరో చెన్నైకి వెళ్లి నటుడు లారెన్స్‌ను కలవమని సలహా ఇచ్చారు. దీంతో గృహలక్ష్మీ వారం రోజుల క్రితం కొడుకు, సోదరుడితో కలిసి లారెన్స్‌ను కలవడానికి చెన్నైకి వచ్చింది. వారికి లారెన్స్‌ చిరునామాను ఎవరూ చెప్పలేదు. దీంతో తిరిగి ఊరుకు వెళ్లలేక, కొడుకును రక్షించుకోలేక చెన్నై, ఎగ్మూర్‌ రైల్వే స్టేషన్‌లోనే ఉండిపోయారు. అక్కడ ప్రయాణికులు దయదలచి ధర్మం చేస్తున్న బిక్షతోనే పొట్ట పోషించుకుంటున్నారు. అలాంటి ధీన స్థితి నుంచి వారిని బయట పడేయడానికి ఎవరైనా కనికరించి ఆదుకుంటే బాగుంటుంది.

మరిన్ని వార్తలు