మహేశ్ బాబుతో...

10 Jan, 2015 23:44 IST|Sakshi
మహేశ్ బాబుతో...

 ‘సీమ టపాకాయ్’, ‘అవును’ తదితర చిత్రాల్లో కథానాయికగా చేసిన పూర్ణ గుర్తుంది కదూ! ఆమె ఇప్పుడు మహేశ్‌బాబుతో సినిమా చేయనున్నారు. కథానాయిక కాదండోయ్! ఐటెమ్ సాంగ్‌లో మహేశ్‌తో కలిసి నర్తించనున్నారు. మహేశ్‌బాబు-కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో ఆమె ఐటమ్ సాంగ్ చేస్తున్నారట. మహేశ్ లాంటి సూపర్‌స్టార్ పక్కన నటించడమే కాదు, నర్తించడం కూడా గొప్ప అవకాశంగానే భావిస్తుంటారు కథానాయికలు. ఇటీవల ‘ఆగడు’లో శ్రుతీహాసన్ అలాంటి ఛాన్సే కొట్టేశారు.
 
 ఆ వెంటనే కొరటాల శివ, మహేశ్‌ల సినిమాలో కథానాయికగా బుక్కయ్యారు. ఇప్పుడు ‘సీమ టపాకాయ్’ పూర్ణ వంతు వచ్చింది. కొరటాల శివ- మహేశ్‌ల చిత్రంలోని ఐటమ్ సాంగ్‌లో  పూర్ణ నర్తించనున్నారు. ఇంతమంది కథానాయికలుండగా, పూర్ణనే కొరటాల శివ ఎంచుకోవడానికి కారణం ఏంటి? అనే విషయంలోకెళ్తే- కథలో ఆ పాట చాలా కీలకమట. పైగా ఆ పాటలో అక్కడక్కడ శాస్త్రీయ నృత్యాన్ని కూడా ప్రదర్శించాలట. పూర్ణ స్వతహాగా ప్రొఫెషనల్ డాన్సర్. పైగా శాస్త్రీయ నృత్యంలో ఆమెకు చక్కని ప్రవేశం ఉంది. అందుకే.. ఏరి కోరి పూర్ణాని ఎంచుకున్నారట.