కిడ్నాప్‌ అయ్యానోచ్‌

21 Jan, 2017 22:44 IST|Sakshi
కిడ్నాప్‌ అయ్యానోచ్‌

‘‘తెలుగులో ఇప్పటివరకూ కిడ్నాప్‌ డ్రామా నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. అయితే మా చిత్రం మాత్రం వాటికి భిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంది’’ అన్నారు నటుడు పోసాని కృష్ణమురళి. ఆయన ప్రధాన పాత్రలో శ్రీకర్‌బాబు దర్శకత్వంలో మధుర మూవీస్‌ పతాకంపై మాధవి అద్దంకి నిర్మిస్తున్న ‘నేను కిడ్నాప్‌ అయ్యా’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దగ్గుపాటి వరుణ్‌ కెమెరా స్విచ్చాన్  చేయగా, నిర్మాత టి. ప్రసన్నకుమార్‌ క్లాప్‌ ఇచ్చారు.

పోసాని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నన్నెవరూ కిడ్నాప్‌ చేయకుండానే కిడ్నాప్‌ అవుతుంటా. అది ఎలా? అన్నది సినిమాలో చూస్తేనే ఆసక్తిగా ఉంటుంది. ఇలాంటి మంచి నిర్మాతలు ఉంటే కొత్త టెక్నీషియన్స్‌తో పాటు పలువురికి ఉపాధి ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘వినోద ప్రధానంగా సాగే చిత్రమిది. హైదరాబాద్, విశాఖపట్నం, గోవాలో చిత్రీకరణ జరుపుతాం’’ అని దర్శకుడు అన్నారు. శ్రీకాంత్, ధీరూ, సౌమిత్రి, హర్ష కృష్ణమూర్తి, విశాల్, మహిమా కొట్టారి, అదితీ సింగ్, దీక్షిత పార్వతి, బ్రహ్మానందం, పృధ్వీ, రఘుబాబు, కృష్ణభగవాన్‌ తదితరులు నటిస్తున్నారు.