గురి  తప్పని  గోల్డ్‌

17 Apr, 2019 00:10 IST|Sakshi

చేతిలో గన్స్‌ పట్టుకున్న హీరోయిన్లు తాప్సీ, భూమి ఫడ్నేకర్‌ ఈ ఏడాది దీపావళికి వెండితెరపై పేలుస్తాం అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓల్డెస్ట్‌ షూటర్స్‌ చంద్రో తోమర్‌ (87), ప్రకాషీ తోమర్‌ (82) జీవితాల ఆధారంగా ‘సాండ్‌ కి ఆంఖ్‌’ అనే సినిమా తెరకెక్కుతోంది. తుషార్‌ హీరానందని దర్శకత్వం వహిస్తున్నారు. చంద్రోగా తాప్సీ, ప్రకాషీగా భూమి నటిస్తున్నారు. ప్రకాశ్‌ ఝా, విక్కీ కడియన్‌ కీలక పాత్రధారులు. దాదాపు 60 ఏళ్ల వయసులో కూడా గన్‌ షూటింగ్‌లో తమ ప్రతిభతో వందల సంఖ్యలో పతకాలు సాధించారు చంద్రో, ప్రకాషీ. మంగళవారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు.

‘‘చంద్రో, ప్రకాషీ.. పంజరాన్ని బద్దలుకొట్టి వారి వయసును చాలెంజ్‌ చేశారు. నచ్చిన పని చేయడానికి నమ్మిన దారిలో ముందుకు వెళ్లారు. షూటింగ్‌ గేమ్‌లో ఫేమ్‌ని సాధించారు. వారు వయసులో ఓల్డ్‌ కావొచ్చు కానీ వారి లక్ష్యం గురి తప్పని గోల్డ్‌’’ అని పేర్కొన్నారు తాప్సీ. నిజమే.. 60 ఏళ్ల వయసులో షూటర్స్‌ అయి, ఎన్నో బంగారు పతకాలు సాధించారు ఇద్దరూ. ‘‘వారు చాలా ధైర్యవంతులు. సరదాగా, ప్రేమగా ఉంటారు. వారు షూటర్స్‌ దాదీస్‌ ఆఫ్‌ ఇండియా’’ అని పేర్కొన్నారు భూమి ఫడ్నేకర్‌. ఈ చిత్రం ఈ ఏడాది దీపావళికి విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు