మారుతిగారి జోక్యం లేదు

2 Aug, 2018 00:33 IST|Sakshi
ప్రభాకర్‌

‘‘డైరెక్టర్‌ మారుతిగారు ‘బ్రాండ్‌ బాబు’ కథ రెడీ చేసి వేరే డైరెక్టర్‌తో చేయాలనుకుంటున్న టైమ్‌లో నిర్మాతలు ‘బన్ని’ వాసు, ఎస్‌.కె.ఎన్, ఎడిటర్‌ ఉద్భవ్‌ నా గురించి చెప్పారు. మారుతిగారు కథ చెప్పారు. బాగా నచ్చింది. డైరెక్షన్‌ చేస్తానని చెప్పా’’ అన్నారు  ప్రభాకర్‌. సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా జంటగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రాండ్‌ బాబు’. మారుతి సమర్పణలో ఎస్‌.శైలేంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రభాకర్‌ చెప్పిన విశేషాలు...


► నా తొలి చిత్రం ‘నెక్ట్స్‌ నువ్వే’ నిరాశపరచింది. అయితే సినిమా చూసినవారు సూపర్‌ అన్నారు. కానీ ప్రేక్షకుల్ని సినిమాకి రప్పించలేకపోయాం. దెయ్యం కథ కావడంతో ‘ఎ’ సర్టిఫికెట్‌ ఇచ్చారు. దీంతో మహిళా ప్రేక్షకులు, పిల్లలు సినిమాకి రాలేదు.

► మారుతిగారు ‘బ్రాండ్‌ బాబు’ కథని చక్కగా వండి నా చేతుల్లో పెట్టి వడ్డించమన్నారు. ఈ చిత్రం షూటింగ్‌ చేస్తున్నప్పుడు నా బ్రదర్‌ చనిపోవడంతో వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్‌ ఆగకూడదని మారుతిగారిని రిక్వెస్ట్‌ చేస్తే ఆయన ఓ సీన్‌ డైరెక్ట్‌ చేశారు. హీరో ఫ్యామిలీకి బ్రాండ్స్‌ పిచ్చి ఉంటుంది. దాన్నే వెటకారంగా, వినోదాత్మకంగా చూపించాం.

► ఇప్పటి హీరోయిన్లు కథ, పాత్ర గురించి కాకుండా  హీరో ఎవరు? బ్యానర్‌ ఏంటి? అని అడుగుతున్నారు. ఈషా నా పాత్ర ఏంటి? అన్నారు. తనను చూస్తుంటే సావిత్రి, సౌందర్యగార్లను చూసినట్టు అనిపించింది.

► ‘బ్రాండ్‌ బాబు’ డైరెక్షన్‌ విషయంలో మారుతిగారు జోక్యం చేసుకోలేదు. మనం మరో సినిమా చేద్దామని మారుతిగారు అన్నారు. జ్ఞానవేల్‌ రాజాగారు ఓ చిత్రం చేద్దామన్నారు. ఆరేడు సెంటిమెంట్‌ కథలు రెడీ చేశా. నటుడిగానూ కొనసాగుతా.

మరిన్ని వార్తలు