రాజుకు తగ్గ రాణి

20 Jul, 2020 01:37 IST|Sakshi
ప్రభాస్‌, దీపికా పదుకొనే

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే కథానాయికగా నటించనున్నట్లు చిత్రబృందం ఆదివారం అధికారికంగా వెల్లడించింది. వైజయంతీ మూవీస్‌ సంస్థ గోల్డెన్‌ జూబ్లీ పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం ఈ ప్రకటన చేశారు.

‘‘ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు దీపికా పదుకొనే. ‘‘కింగ్‌కి సరిపడేంత క్వీన్‌ కావాలి కదా మరి! చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం (దీపికా ఎంపికను ఉద్దేశించి) ఇది. పిచ్చెకిద్దాం. ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రను దీపికా పదుకొనే చేయనుండటం నన్నెంతో ఎగై్జట్‌మెంట్‌కి గురి చేస్తోంది. ఇందులో ప్రభాస్‌–దీపికల జంట ఓ మెయిన్‌ హైలైట్‌.

వాళ్లిద్దరి మధ్య నడిచే కథ రాబోయే సంవత్సరాల్లో ప్రేక్షకుల హృదయాల్లో గాఢమైన ముద్ర వేస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు నాగ్‌ అశ్విన్‌. ‘‘భారతీయ సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసినవారి జాబితాలో మా స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఈ సినిమా మాకో సువర్ణావకాశం. ప్రేక్షకులు ఓ కొత్త అనుభవాన్ని ఆస్వాదించేలా చేసేందుకు కూడా మాకు ఇదో గొప్ప అవకాశం’’ అన్నారు అశ్వినీదత్‌. ‘‘భారతీయ సినిమాలో మా మరపురాని 50ఏళ్ల ప్రయాణాన్ని ఇలాంటి గొప్ప, ఉద్వేగభరితమైన వార్తతో సెలబ్రేట్‌ చేసుకుంటున్నందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది’’ అన్నారు ప్రియాంక, స్వప్నా. సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది.

మరిన్ని వార్తలు