భవంతిలో.. జ్ఞాపకాలలో...

18 Jan, 2020 00:59 IST|Sakshi

యాభై ఏళ్ల క్రితం నాటి భవంతి అది. అందులో ఓ గదిలో పియానో, పక్కనే మెట్లు, గోడలపై జ్ఞాపకాలను గుర్తు చేసే ఫ్రేమ్స్‌.. ఆ లొకేషన్‌లోకి స్టైల్‌గా అడుగుపెట్టారు ప్రభాస్‌. అక్కడికి వెళ్లి ఏం చేశారు? అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌. ప్రభాస్‌ హీరోగా ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌)  అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై కృష్ణంరాజు, వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

1970 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్‌ మూవీ చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్స్‌ను తయారు చేయించారు. కొంత బ్రేక్‌ తర్వాత ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ శుక్రవారం ప్రారంభమైంది. భవంతి సెట్‌లో ప్రభాస్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వారం రోజుల తర్వాత పూజా హెగ్డే కూడా ఈ చిత్రీకరణలో పాల్గొంటారు. ఆ సమయంలో కొన్ని ప్రేమ సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తోంది చిత్రబృందం. ఈ సినిమాకు అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.  

మరిన్ని వార్తలు